ఏపీలో కరోనా వ్యాప్తి మొదలైనప్పటి నుంచే సీఎం జగన్, ప్రభుత్వ వర్గాలు చాలా అలెర్ట్గా ఉన్నాయి. నెల్లూరులో తొలి కేసు నమోదు అయినప్పటి నుంచే ఎక్కడికక్కడ అప్రమత్తం చేశారు. జగన్ కరోనాతో కలిసి మనం పనిచేయక తప్పదని చేసిన వ్యాఖ్యలపై కూడా అప్పట్లో విపక్షాలు పెద్ద ఎత్తున సెటైర్లు వేశాయి. అయినా జగన్ మాత్రం అవేమి పట్టించుకోకుండా ముందుకు వెళ్లారు. ముందు జగన్ వ్యాఖ్యలపై షాక్ అయిన ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సైతం ఇప్పుడు జగన్ రూట్లో నే వెళుతున్నారు.
కరోనాతో కలిసి జీవనం కొనసాగించక తప్పదన్న నిర్ణయానికి వచ్చారు. అయితే ఏపీ ప్రభుత్వం, జగన్పై విమర్శలు చేయందే టీడీపీ అధినేత చంద్రబాబుకు ఎంత మాత్రం నిద్రపట్టదు. ఇటీవల జూమ్ మీటింగ్లు పెట్టుకుంటూ కాలం గడుపుతోన్న చంద్రబాబు ఇప్పుడు మరో జూమ్ మీటింగ్ పెట్టారు. తాజాగా ఏపీలోని కార్పొరేట్ ఆసుపత్రుల డాక్టర్లతో జూమ్ మీటింగ్ పెట్టిన ఆయన కరోనాను ఎదుర్కోవడానికి సలహాలు ఇవ్వాలని డాక్టర్లను కోరడంతో పాటు వాటిని కేంద్రానికి అందిస్తానని చెప్పారు.
ఇక ఏపీలో కరోనా రోగులను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని.. ఏపీలో ప్రతి సెకనుకు ఒకరు కరోనాతో చనిపోతున్నారని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు అందరినీ షాక్కు గురి చేస్తున్నాయి. చంద్రబాబు చెప్పిన దాని ప్రకారం సెకనుకు ఒకరు అంటే నిమిషానికి 60 మంది.. ఒక్క గంటకే 3600 మంది.. ఇక రోజుకు 86 వేల మంది చనిపోతుండాలి.. ఇప్పటి వరకు ఏపీలో కరోనా కేసులే 90 వేలు దాటలేదు. దీనిని బట్టి చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు ఎంత కామెడీగా ఉన్నాయో అర్థమవుతోంది. కనీసం ఒక మాట మాట్లాడేటప్పుడు జనం నవ్వుతారన్న ఇంకిత జ్ఞానం కూడా లేకుండా ఈ తరహా వ్యాఖ్యలు చేయడం ఇటీవల కాలంలో ఆయనకే చెల్లింది.