యావత్ దేశం బడ్జెట్ పై పెదవి విరుస్తుంటే వైసీపీ మాత్రం ఏమీ స్పందించడం లేదు.బడ్జెట్ ప్రసంగం వినగానే కేసీఆర్ తన దైన భావోద్వేగాలను అభిప్రాయాలను ఫేస్బుక్ లో పోస్టు చేశారు.అదేవిధంగా తన అభిప్రాయాలకు అనుగుణంగా పార్లమెంట్ లో నడుచుకోవాలని, కొత్త బడ్జెట్ ద్వారా మనకు దక్కిందేమీ లేదని ఎంపీలకు దిశా నిర్దేశం చేశారని కూడా సమాచారం.ఇప్పటికే సెషన్ ముందు ఎంపీలతో మాట్లాడారు.మరోసారి కూడా వీరికి గైడ్లైన్స్ ఇచ్చారు అని కూడా తెలుస్తోంది. ఇదే సమయంలో మన వైసీపీ వాళ్లు మాత్రం ఏమీ మాట్లాడకుండా బీజేపీకి మద్దతు నిలిచేందుకు తద్వారా తమ ప్రయోజనాల నెరవేర్పునకు సన్నాహాలు చేస్తున్నారని తెలుస్తోంది.
ఈ నేపథ్యంలో పార్లమెంట్ సమావేశాల సందర్భంగా వైసీపీ స్టాండ్ ఏంటన్నది తేలిపోయింది.అస్సలు రాష్ట్ర ప్రయోజనాలే పరమావధిగా పనిచేయాలన్న ఆలోచనే లేనివిధంగా వైసీపీ స్టేట్మెంట్లు ఉన్నాయి.ఉంటాయి కూడా! ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో బీజేపీని ఎదురించే సత్తా కానీ ఆలోచన కానీ వైసీపీకి లేవని తేలిపోయింది కనుక. ఓ వైపు టీఆర్ఎస్ సమర సన్నాహాలను చేస్తుంటే మరోవైపు వైసీపీ మాత్రం ఎందుకు వచ్చిన గొడవ అన్న విధంగా బీజేపీ గొడుగు కింద చేరిపోయి వారికి అనుగుణంగా వంత పాట ఒకటి పాడుతోంది.
పెగాసస్ స్పై వేర్ పై ఇప్పటికే ప్రకంపనలు రేగుతున్నాయి.విపక్ష పార్టీలన్నీ కలసి సభలో గందరగోళం సృష్టించాలని చూస్తున్నాయి. ఇదే సమయంలో ఇది అస్సలు పసలేని బడ్జెట్ అంటూ కేసీఆర్ ఓ స్టేట్మెంట్ ఇచ్చారు. దీని ఆధారంగా చూసుకున్నా తెలంగాణ రాష్ట్ర సమితి సభ్యులు పార్లమెంట్ లో గందరగోళం సృష్టించడం ఖాయం అని తేలిపోయింది. అయినా కూడా వైసీపీ మాత్రం సభలో గందరగోళం చేసే వారిని సస్పెండ్ చేసేయ్యమని సాయిరెడ్డి ఓ ప్రకటన ఇచ్చి మోడీపై తనకున్న భక్తి ఎంతన్నది చాటుకున్నారు. ఇక బడ్జెట్ లో మనకు ఏమీ దక్కకపోయినా కూడా వైఎస్సార్సీపీ నుంచి యుద్ధం ఆశించలేం అని కూడా తేలిపోయింది. అందుకనో ఎందుకనో ఈ సారి బడ్జెట్ సమావేశాలపై జరిగే చర్చలో మనం ఆంధ్రా ఎంపీల నుంచి ఏమీ ఆశించకుండా ఉంటేనే మేలు.