అనేక అనుమానాలు, చిక్కుముళ్లు, మలుపులు... బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణంపై ఎప్పటికప్పుడు కొత్త ట్విస్టులు వెలుగుచూస్తూనే ఉన్నాయి‌. సుశాంత్‌ మరణంపై బీజేపీ ఎంపీ రేకెత్తిస్తున్న అనుమానాలు.. అతని స్నేహితుడు సందీప్‌ సింగ్‌ చుట్టూ తిరుగుతున్నాయి. గత పది నెలలుగా ఎందుకు టచ్‌లో లేడనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి సుశాంత్ మరణంపై సంచలన ఆరోపణలు చేశారు. సుశాంత్ కడుపులో ఉన్న విషపు ఆనవాళ్లు బయటపడకుండా ఉండేందుకే పోస్టుమార్టమ్‌ను ఉద్దేశపూర్వకంగా ఆలస్యం చేశారని సుబ్రహ్మణ్యస్వామి ఆరోపించారు. అంతేకాదు సుశాంత్ సన్నిహితుడు, సినీ నిర్మాత సందీప్ సింగ్‌పై కూడా ఆయన అనుమానాలు వ్యక్తం చేశారు.

సందీప్ సింగ్ దుబాయ్‌కి ఎన్నిసార్లు వెళ్లాడు... ఎందుకు వెళ్లాడనేది ప్రశ్నించాలని సుబ్రహ్మణ్యస్వామి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. సుశాంత్ కేసులో సీబీఐ దర్యాప్తు ముమ్మరమైన తరుణంలో సందీప్ సింగ్‌పై అనుమానాలు హాట్ టాపిక్‌గా మారాయి‌. సందీప్ సింగ్ కాల్ డిటైల్ రికార్డ్ ప్రకారం.. గత 10 నెలలుగా అతను సుశాంత్‌తో టచ్‌లో లేడు. కనీసం మెసేజ్, వాట్సప్ చాట్ కూడా చేయలేదు.

సుశాంత్‌తో 10 నెలలుగా టచ్‌లో లేని సందీప్ సింగ్... అతని మాజీ గర్ల్ ఫ్రెండ్‌ అంకిత లోఖండేతో మాత్రం టచ్‌లో ఉన్నట్లు సీడీఆర్ డేటాలో వెల్లడైంది. అంతేకాదు సుశాంత్ సింగ్ జూన్ 14న మరణించగా... అతని మృతదేహాన్ని తరలించిన అంబులెన్స్ డ్రైవర్‌తో జూన్ 16న సందీప్ సింగ్ మాట్లాడాడు. సుశాంత్ మరణించిన 2 రోజుల తర్వాత అంబులెన్సు డ్రైవర్‌తో మాట్లాడాల్సిన అవసరం సందీప్‌ సింగ్‌కు ఏముందనేది ఇప్పుడు అందరినీ తొలుస్తున్న ప్రశ్న.

సుశాంత్ మరణవార్త తర్వాత సందీప్ సింగ్ ఇచ్చిన స్టేట్‌మెంట్స్ కూడా భిన్నంగా ఉన్నాయి. సుశాంత్ మరణవార్త వెలుగుచూసినప్పుడు తాను ఇంట్లోనే ఉన్నానని సందీప్ సింగ్ చెప్పగా... ఆ సమయంలో అతను లంచ్ చేస్తున్నాడని కాంగ్రెస్ నేత సంజయ్ నిరుపమ్ తెలిపారు. కొద్దిరోజుల క్రితం సుశాంత్ సింగ్ తండ్రి తరుపు న్యాయవాది వికాస్ సింగ్ కూడా సందీప్‌పై పలు అనుమానాలు వ్యక్తం చేశారు. సుశాంత్ మరణించిన జూన్ 14న సందీప్ ఆ ఇంట్లోనే ఉండి ఉంటాడన్న అనుమానం వ్యక్తపరిచారు.

మరింత సమాచారం తెలుసుకోండి: