అందులో భాగంగానే.. జగన్ ఓ సంచలన నిర్ణయం తీసుకున్నారు. బీసీ కులాల జనాభా ప్రాతిపదికన కార్పొరేషన్లను ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో వెనుకబడిన వర్గాలకు బీసీ కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. 139 బీసీ కులాలకు వెనుకబడిన తరగతుల శాఖ కొత్తగా 56 బీసీ కార్పొరేషన్లును ఏర్పాటు చేసింది. పది లక్షలకు పైన జనాభా ఉన్న కార్పొరేషన్లను ‘ఏ’ కేటగిరీ కింద, లక్ష నుంచి పది లక్షల వరకు జనాభా ఉన్న కార్పొరేషన్లను ‘బి’ కేటగిరీ కింద, లక్షలోపు జనాభా ఉన్న కార్పొరేషన్లను ‘సి’ కేటగిరీ కింద విభజించింది.
ఈ కార్పొరేషన్లకు ఈ నెల 18న కార్పొరేషన్ల ఛైర్మన్లు, డైరెక్టర్ల నియామకం చేపట్టనుంది. వెనుకబడిన కులాలకు ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు వేగంగా లబ్దిదారులకు అందేలా ఈ కార్పొరేషన్లు ఏర్పాటు చేశారు జగన్. 139 బీసీ కులాలకు ప్రాతినిధ్యం వహించేలా ఈ 56 కార్పోరేషన్లు పనిచేస్తాయంటున్నారు. జిల్లాలకు ప్రాతినిధ్యం వహించేలా ప్రతి కార్పొరేషన్లోనూ 13 మంది డైరెక్టర్లను నియమించాలన్నది జగన్ యాక్షన్ ప్లాన్. కొత్తగా ఏర్పాటు చేసిన 56 బీసీ కులాల కార్పొరేషన్ల పరిధిలో మిగతా ఉపకులాలకూ ప్రాతినిధ్యం వస్తుంది. ఏపీ సొసైటీల రిజిస్ట్రేషన్ చట్టం 2001 ప్రకారం బీసీ కులాల కార్పొరేషన్ల ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం వేర్వేరు ఉత్తర్వులు జారీ చేసింది.