తెలంగాణలో ఈ నెల 30వ తేదీ వరకు లాక్డౌన్ పొడిగిస్తున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. కరోనా వైరస్ కట్టడికి ఈ నిర్ణయం తప్పడం లేదని సీఎం తెలిపారు. లాక్డౌన్ నిబంధనలను మరింత కఠినంగా అమలు చేస్తామని, ఇందుకు ప్రజలు కూడా పూర్తిస్తాయిలో సహకరించాలని ఆయన కోరారు. ఇక్కడే సీఎం కేసీఆర్ మరొక ఆసక్తికరమైన విషయం చెప్పారు. కరోనా వైరస్ బారి నుంచి తెలంగాణ ఎప్పుడు బయటపడుతుందో చెప్పేశారు. అంతా బాగుంటే..మర్కజ్ లాంటి ఉత్పాతం తలెత్తకుంటే.. ఏప్రిల్ 24వ తేదీ తర్వాత తెలంగాణ కరోనా వైరస్ నుంచి బయటపడినట్టేనని చెప్పారు. ఈనెల 24వ తేదీ తర్వాత దాదాపుగా ఆస్పత్రుల నుంచి అందరూ డిశ్చార్జ్ అవుతాని ఆయన పేర్కొన్నారు. ప్రగతిభవన్లో శనివారం మధ్యాహ్నం 3గంటల నుంచి సీఎం కేసీఆర్ అధ్యక్షతన నిర్వహిస్తున్న ఈ సమావేశం ఐదు గంటలకుపైగా జరిగింది.
లాక్డౌన్ పొడిగింపు అంశంతోపాటు ధాన్యం కొనుగోళ్లు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితులపై ప్రధానంగా ఈ సమావేశంలో చర్చించారు. ఈ సందర్భంగా శనివారం రాత్రి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీఎం వివరాలు వెల్లడించారు. ఈ సందర్భంగా తెలంగాణలో ఇప్పటివరకు నమోదైన కేసుల వివరాలను సీఎం కేసీఆర్ వెల్లడించారు. ఇతర దేశాలనుంచి వచ్చిన 34 మందితోపాటు 25937 మంది క్వారంటైన్ నుంచి డిశ్చార్జ్ అయ్యారని తెలిపారు. పాతవికొత్తవి కలుపుకుని శనివారం రాత్రి వరకు 503 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయని ఆయన తెలిపారు. ఇందులో 14మంది చనిపోయారని, 96 మంది డిశ్చార్జ్ అయ్యారని పేర్కొన్నారు. యాక్టివ్ కేసులు 393 ఉన్నాయని తెలిపారు. మర్కజ్కు వెళ్లిన వచ్చిన సుమారు 1200మందిని గుర్తించి, క్వారంటైన్ చేశామని 1640మంది ప్రస్తుతం క్వారంటైన్లో ఉన్నారని సీఎం కేసీఆర్ ముఖ్యమంత్రి తెలిపారు. రాష్ట్రంలో కంటైన్మెంట్ జోన్లు 243 ఉన్నాయని, ఇందులో జీహెచ్ఎంసీ పరిధిలో 123, ఇతర ప్రాంతాల్లో 120 ఉన్నాయని తెలిపారు.