పరిషత్ ఎన్నికలను బహిష్కరించాలన్న తెలుగు దేశం నిర్ణయంతో అంతా  చంద్రబాబును ఫుట్ బాల్ ఆడుకుంటున్నారు. సొంత పార్టీ నేతలు, అధికార పక్షం నేతలు ఇలా అంతా చంద్రబాబుపైనే విమర్శలు ఎక్కుపెడుతున్నారు.  చంద్రబాబుకు ప్రజల దగ్గర వెళ్లి టీడీపీకి ఓటు వేయండి అని చెప్పే ధైర్యం  లేదని వైసీపీ నేతలు అంటున్నారు. ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలు చేస్తే ప్రజలు తరిమికొట్టే ప్రమాదం ఉందని గ్రహించి.. ఏ ఇంటికి వెళ్లకుండా ప్రెస్‌మీట్లు పెట్టి ఇష్టానుసారంగా మాట్లాడుతున్నాడని ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి  మండిపడ్డారు.

పబ్లిసిటీ, మేనేజ్‌మెంట్‌ను మాత్రమే నమ్ముకున్న వ్యక్తి చంద్రబాబు అని ఎమ్మెల్యే భూమన అన్నారు. ప్రచార రథాలు, ప్రసార మాధ్యమాలు తప్ప ప్రజలను ఎప్పుడూ చంద్రబాబు నమ్ముకోలేదన్నారు.  ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అందిస్తున్న సంక్షేమ పాలనే తిరుపతి ఉప ఎన్నికల్లో భారీ మెజార్టీ అందిస్తుందని వైసీపీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి అన్నారు. వైసీపీ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు పెద్ద ఎత్తున ప్రజల్లోకి వెళ్లాయని, ప్రజలంతా వైయస్‌ఆర్‌ సీపీకే ఓటు వేయాలనే అభిప్రాయంతో ఉన్నారి భూమన అంటున్నారు.


తిరుపతి నగరంలో లోక్‌సభ ఉప ఎన్నిక ప్రచారాన్ని ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి పార్టీ శ్రేణులతో కలిసి నిర్వహించారు. ఇంటింటికీ వెళ్లి  ఫ్యాన్‌ గుర్తుకు ఓటేసి వైయస్‌ఆర్‌ సీపీ అభ్యర్థి గురుమూర్తిని గెలిపించాలని కోరారు. సంక్షేమ పథకాలన్నీ తమకు అందుతున్నాయని, ఫ్యాన్‌ గుర్తుకే ఓటేస్తామని ప్రజలు స్వచ్ఛందంగా చెబుతున్నారని భూమన అన్నారు. సీఎం వైయస్‌ జగన్‌ ప్రతిష్టాత్మకమైన నాయకుడు అని ఉప ఎన్నిక ద్వారా దేశానికి తెలియచెబుతామని ప్రజలే అంటున్నారని ఎమ్మెల్యే భూమన అన్నారు.  

మరోవైపు తిరుపతి ఉప ఎన్నికలో వైయస్‌ఆర్‌ సీపీ భారీ మెజార్టీతో గెలుస్తుందని పంచాయతీ రాజ్‌ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఫ్యాన్‌ గుర్తుకు ఓటేసి డాక్టర్‌ గురుమూర్తిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. నెల్లూరు జిల్లా ఓజిలి మండలంలో ఆయన వైసీపీ అభ్యర్థి డాక్టర్‌ గురుమూర్తికి మద్దతుగా  ప్రచారం నిర్వహించారు.  


మరింత సమాచారం తెలుసుకోండి: