ఆ మాజీ మంత్రి నోట కొత్త పలుకులు వినిపిస్తున్నాయి. ఎప్పుడు రాజకీయాలు, ఎత్తుగడల గురించి మాట్లాడే ఆయన ఈసారి కులం కెపాసిటీ గురించి చర్చిస్తున్నారు. అదీ ఎన్నికలకు రెండున్నర ఏళ్ళ ముందు నుంచి. గంటా శ్రీనివాసరావు మాజీ మంత్రి. టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన రెండున్నర ఏళ్లుగా మౌనంగా ఉంటున్నారు. అధికారం ఎక్కడ ఉంటే గంటా అక్కడ ఉంటారనేది పొలిటికల్ సర్కిల్స్ లో జరిగే చర్చ. అందుకు భిన్నంగా ఈసారి ఆయన టిడిపి ఎమ్మెల్యేగానే కొనసాగుతున్నారు.  వాస్తవానికి గంటా వైసీపీలో చేరుతారనే గట్టి ప్రచారం నడిచింది. సీఎం జగన్ ప్రతిపాదించిన మూడు రాజధానులు కాన్సెప్ట్ ను ఆయన బహిరంగంగానే స్వాగతించారు.

 పరిపాలన రాజధానిగా విశాఖ కు తప్ప మరో నగరానికి ఆ అర్హత లేదని చెప్పుకొచ్చారు. గంటా కామెంట్స్ పై అప్పట్లో టిడిపిలో చర్చ జరిగింది. ఆ తర్వాత గంటా చూపు జనసేన వైపని పుకార్లు షికార్లు చేశాయి. చిరంజీవి తో అనుబంధం జనసేనకు పటిష్టమైన నాయకత్వం అవసరమనే  కోణంలో ఆయన జన సైనికుడు అవుతారనే టాక్ వినిపించింది. గంటా సైతం సన్నిహితుల అభిప్రాయాలు తీసుకోవడంతో ఇక జనసేనలో చేరికకు ముహూర్తమే ఆలస్యమనే స్థాయికి చర్చ వెళ్ళింది. అయితే వాళ్లు వద్దనుకున్నారో,ఈయనే వెళ్లలేదో ప్రయత్నాలు ఫలించలేదు. అలాగని గంటా టిడిపిలో ను యాక్టివ్ గా లేరు. చంద్రబాబు ఆదేశాలను తప్ప పార్టీలో మరే నాయకత్వాన్ని గౌరవించాల్సిన అవసరం లేదు అనేది ఆయన అభిప్రాయం గా చెబుతారు. పరోక్షంగా పార్టీలో యువ నాయకుడి ఆదిపత్యం భరించడం కష్టమని గంటా దూరంగా ఉంటున్నారనేది అంతర్గత చర్చ. విశాఖ స్టీల్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో గంటా పేరు మారుమ్రోగింది. తర్వాత ఏమైందో ఏమో మళ్లీ క్రియాశీలక రాజకీయాలకు దూరంగా జరిగారు. టిడిపి లో ఉండి లేనట్టుగా వ్యవహరిస్తున్నారు. తాజాగా మరో బహిరంగ వేదికపైకి తెరపైకి వచ్చారు గంటా అది కూడా వంగవీటి రంగ విగ్రహ ఆవిష్కరణ సభతో. కాపు సామాజిక వర్గం భవిష్యత్తులో రాష్ట్ర రాజకీయాల్లో శాసిస్తోందని గంటా శ్రీనివాస్ ఆ సభలో చెప్పారు. కాపులంతా ఏకం కావాలని, రాజకీయాల్లో కీలక పాత్ర పోషించడానికి  బలోపేతం కావడానికి తాను కృషి చేస్తానని అన్నారు.

మాజీమంత్రి ఎత్తుగడలు వెనుక వ్యూహం ఏంటన్నది ఇప్పుడు హాట్ టాపిక్. ఎన్నికలకు రెండున్నర ఏళ్ళ ముందు వ్యాఖ్యలు చేయడం అదే వేదిక లో వైసీపీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు  పంచుకోవడం ఆసక్తిని రేకెత్తిస్తోంది. కాపు సామాజిక వర్గం లో బలమైన నాయకుడు అనే ముద్ర వేసుకోవడం ద్వారా రాజకీయాలను తన వైపు తిప్పుకునే ప్రయత్నంగా ప్రచారం జరుగుతోంది. వచ్చే ఎన్నికల నాటికి కొత్త పొత్తులు ఉదయిస్తాయని అనుకుంటున్నారు. ఆ పొత్తుల లాభనష్టాలను ముందే పసిగట్టిన గంటా కులం వ్యవహారం భుజానికెత్తుకున్నారని తెలుస్తోంది. వివిధ కారణాలతో రాజకీయంగా స్తబ్దతగా ఉన్న నాయకులతో ఆయన సమావేశం కావడం చర్చగా మారింది. ఇదంతా ఉనికి కోసం చేసే ప్రయత్నమా, లేక నిజంగానే సామాజికవర్గానికి పెద్దదిక్కుగా మారాలనే ఆలోచన గంటా శ్రీనివాస రావు లో ఉందా అనేది  తెలియాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: