ఏపీకి సంబంధించి వచ్చేఎన్నికల్లో మూడుపాయింట్లు చాలా కీలకంగా ఉండబోతున్నాయి. ఆశ్చర్యం ఏమిటంటే అధికార, ప్రతిపక్షాలు రెండింటికీ ఈ మూడుపాయింట్లే కీలకంగా మారబోతున్నాయి. ఇంతకీ ఆ మూడుపాయింట్లు ఏమిటంటే మొదటిది రాజధాని అంశం. రెండో పాయింట్ బీసీలు. ఫైనల్ గా మూడోపాయింట్ ఏమిటంటే కాపులు. తెలుగుదేశంపార్టీ అమరావతి మాత్రమే ఏకైక రాజధానిగా ఉండాలనే అజెండాతోనే ఎన్నికలకు వెళ్ళబోతున్నట్లు రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు ప్రకటించారు.





ఇదే సమయంలో మూడురాజధానులే తమ అజెండాగా ఉంటుందని జగన్మోహన్ రెడ్డి స్పష్టంచేశారు. మరి రాజధాని లేదా రాజధానుల విషయంలో ప్రజలు ఎవరికి మద్దతుగా నిలబడతారనేది బాగా ఇట్రస్టింగ్ పాయింట్. ఇక రెండో పాయింట్ బీసీలు కూడా రెండుపార్టీలకు కీలకం కాబోతోంది.  మొదటినుండి టీడీపీకే ఎక్కువ మద్దతుగా నిలబడుతున్న  బీసీలు మొదటిసారి 2019 ఎన్నికల్లో వైసీపీవైపు మొగ్గుచూపారు. అందుకనే  తమకు దూరమైన బీసీలను మళ్ళీ దగ్గరకు తీసుకోవాలని చంద్రబాబు గట్టిగా ప్రయత్నిస్తున్నారు.





టీడీపీకి ఇంకా మద్దతుగా నిలబడుతున్న బీసీలను సాంతం దూరంచేయటమే లక్ష్యంగా జగన్ పావులు కదుపుతున్నారు. అందుకనే కార్పొరేషన్లని, నామినేటెడ్ పదవులని, జిల్లా పరిషత్ ఛైర్మన్లు, ఎంపీలుగా ఎన్ని అవకాశాలుంటే అన్నింటినీ బీసీలతోనే నింపుతున్నారు. కాబట్టి వచ్చే ఎన్నికల్లో బీసీలు పోషించబోయే పాత్ర చాలా కీలకంగా ఉండబోతోంది. ఇక కాపుల అంశంకూడా కీలకమే. ఇక్కడ గమనించాల్సిందేమంటే బీసీల్లాగ కాపులు ఒకేపార్టీకి మద్దతుగా ఎప్పుడూ నిలవలేదు.





అయితే వచ్చే ఎన్నికల్లో కాపుల మద్దతుతో ఓట్లు, సీట్లు సంపాదించుకోవాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. పవన్ ప్రయత్నాలను అడ్డుకోవటమే వైసీపీ ముందున్న టార్గెట్. టీడీపీ,జనసేన పొత్తు పెట్టుకుంటే కాపుల ఓట్లు కీలకమవుతాయి. అందుకనే ఇప్పటినుండే పవన్ కు కాపులను దూరంచేయటం కోసమే వైసీపీ ప్రయత్నాలు మొదలుపెట్టేసింది. దీనికి విరుగుడుగా పవన్, చంద్రబాబు ఏమిచేస్తారో చూడాలి. మొత్తానికి అధికార, ప్రతిపక్షాలు గెలుపుకోసం కామన్ పాయింట్ల మీద ఆధారపడటమే విచిత్రంగా ఉంది.


మరింత సమాచారం తెలుసుకోండి: