ఆంధ్రప్రదేశ్‌ముఖ్యమంత్రి  వైఎస్ జగన్ ఆరు నెలల పాలనపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేశ్ ట్విట్టర్ వేదికగా నిప్పులు చెరిగారు. ఎన్నికలకు ముందు నవరత్నాలు ఇస్తా అన్న జగన్.. అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లో మాట మార్చి ప్రజల నెత్తిన నవరత్న తైలం రాశారని లోకేశ్ ఎద్దేవా చేశారు. తొలి నెలలోనే ప్రజావేదికను కూల్చేసిన జగన్.. ఫ్యాక్షనిస్ట్ మైండ్ సెట్‌తో.. హింస, విధ్వంసానికి కట్టుబడ్డారంటూ... లోకేశ్ ఘాటైన వ్యాఖ్యలు చేశారు.

ఆరు నెలల్లో అభివృద్ధి శూన్యం. సంక్షేమం సున్నా. పాదయాత్రలో ఇచ్చిన హామీలు ఒక మాయ. అధికారంలోకి వచ్చిన తరువాత జగన్ మహిళల్ని మోసం చెయ్యడం, రైతులను దగా చెయ్యడం, యువతని నిలువునా ముంచటం, పేదవాడి పొట్ట కొట్టటం మాత్రమే నిజం. వృద్ధులకు నెలకు రూ.250, రైతులకు 625 రూపాయలు ఇస్తున్న జగన్.. గ్రామ వాలంటీర్ల పేరుతో వైకాపా కార్యకర్తలకు నెలకు రూ.8 వేలు ఇస్తూ ఏడాదికి రూ.4 వేల కోట్ల ప్రజాధనాన్ని దోచేస్తున్నారు. సంక్షేమ కార్యక్రమాలకు రివర్స్ టెండర్ పెట్టిన ఘనుడు జగన్ అని లోకేశ్ ఎద్దేవా చేశారు. అన్న క్యాంటిన్లు, చంద్రన్న బీమాతో సహా చంద్రబాబు హయాంలో ప్రవేశపెట్టిన అనేక సంక్షేమ కార్యక్రమాలను రద్దు చేశారని ఆరోపించారు. ఆరు నెలల పాలనలో రత్నాలు అన్ని జారిపోయాయని ఎద్దేవా చేశారు.

45 ఏళ్లకే బీసీ, ఎస్సీ, ఎస్టీ మహిళలకు పెన్షన్ అన్న హామీ ఎగిరిపోయిందన్న లోకేశ్.. రూ.3 వేల పెన్షన్ పోయింది. రైతు భరోసా 13,500 అని ఇప్పుడు 7,500 ఇస్తున్నారు. అమ్మ ఒడిని ఆంక్షల ఒడిగా మార్చారని ఆరోపించారు. రత్నాలు వైకాపా నాయకులు మింగి రాళ్లు ప్రజల చేతిలో పెడుతున్నారు. ఎంత మంది రైతులు, కౌలు రైతులకు భరోసా ఇచ్చారో చెప్పలేని దుస్థితిలో జగన్ గారి ప్రభుత్వం ఉంది అని లోకేశ్ విమర్శించారు.యువనేస్తం పథకంతో నెలనెలా భృతి చెల్లించి, శిక్షణ ఇచ్చి.. యువతను వారి ప్రతిభకు తగ్గ రంగాల్లో ఉన్నతంగా చూడాలనుకున్నాం. అలాంటిది ఆ పథకాన్ని ఆపేసి, నిరుద్యోగులకు భవిష్యత్తు లేకుండా చేసింది వైసీపీ ప్రభుత్వం. దేశంలో ఎవరైనా పెట్టుబడులు పెట్టాలని అనుకుంటున్నాం అని అంటే వారిని చంద్రబాబు ఏపీకి తీసుకెళ్ళి పోతారేమో అని మిగతా రాష్ట్రాలు భయపడేవి. ఇప్పుడు ఏపీ నుంచి వెళ్లిపోయే కంపెనీలని సునాయాసంగా వాళ్ళ రాష్ట్రాలకు తీసుకెళ్ళిపోతున్నారు.

వైసీపీ పాలనలో తెలుగు తల్లికి, తెలుగు భాషకీ, తెలుగు సంస్కృతికీ... మొత్తంగా తెలుగుదనానికే గడ్డురోజులొచ్చాయి. జాతీయ గీతాన్నే మర్చిపోయినోళ్ళకు ఒక జాతి ఆత్మగౌరవాన్ని నిలబెట్టడం ఏం చేతనవుతుంది? అని లోకేశ్ ప్రశ్నించారు. కేంద్రం మెడలు వంచుతాం అన్న జగన్.. మెడలు వంచుకొని కాళ్లు పట్టుకున్నారని లోకేశ్ ఎద్దేవా చేశారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: