వైసీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి గత మూడు రోజులుగా సుజనా చౌదరి, కన్నా లక్ష్మీనారాయణపై సంచలన ఆరోపణలు చేసి వార్తల్లో నిలుస్తున్నారు. బీజేపీ ఏపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ 20 కోట్ల రూపాయలకు అమ్ముడుపోయారని... ఇచ్చినవారికి, పుచ్చుకున్నవారికి మధ్య సుజనాచౌదరి దళారీగా వ్యవహరించారని అన్నారు. కేంద్రం ఆమోదం లేకుండా చంద్రబాబులానే కన్నా మతిభ్రమించి మాట్లాడుతున్నారని చెప్పారు.
సుజనా చౌదరి బోగస్ కంపెనీలు సృష్టించి వేల కోట్ల రూపాయలు బ్యాంకులకు ఎగ్గొట్టారని... కన్నా ఓ అవినీతిపరుడు అని అన్నారు. కన్నా 20 కోట్ల రూపాయలకు అమ్ముడుపోయారని తాను మళ్లీ చెబుతున్నానని చెప్పారు. కన్నాలాంటి వాళ్లు తనను ప్రశ్నించడానికి అనర్హులు అని అన్నారు. విజయసాయిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. కన్నా పార్టీ అధ్యక్ష పదవి నుంచి ఎందుకు వైదొలగడం లేదని ప్రశ్నించారు.
విజయసాయిరెడ్డి ఈరోజు ట్విట్టర్ ఖాతాలో చంద్రబాబుపై కూడా విమర్శలు చేశారు. ర్యాపిడ్ టెస్టింగ్ కిట్ల గురించి రాళ్లేయాల్సిన సమయమేనా ఇది అని ప్రశ్నించారు. బాబు జమానాలోలాగా కమీషన్లకు కకృత్తి పడే ప్రభుత్వం వైసీపీ కాదని అన్నారు. తమ పార్టీకి ప్రజల ప్రాణాలే ముఖ్యమని అన్నారు. రాష్ట్రంలో కరోనాను నియంత్రించాలంటే పరీక్షలను పెంచడం తప్పనిసరి అని చెప్పారు. బాబు, అతని బానిసలు గోతి కాడ నక్కలా ఊళలు వేయవద్దని.. ఆకాశంపై ఉమ్మేయవద్దని చెప్పారు.
రాష్ట్రంలో పరీక్షలు చేయడం లేదని నిన్నటివరకు బాధ పడిన చంద్రబాబు నేడు ప్రస్తుతం దక్షిణ కొరియా నుంచి కిట్లు కొన్నారని సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారని... రాష్ట్రంలో మరణాలు పెరిగితే శవ రాజకీయాలు చేయవచ్చని టీడీపీ భావిస్తోందని చెప్పారు.
ర్యాపిడ్ టెస్టింగ్ కిట్ల గురించి రాళ్లేయాల్సిన సమయమేనా ఇది. బాబు జమానాలోలాగా కమిషన్లకు కక్కుర్తి పడే ప్రభుత్వం కాదిది. ప్రజల ప్రాణాలు ముఖ్యం. కరోనాను నియంత్రించాలంటే పరీక్షలు పెంచడం తప్పనిసరి. బాబు,అతని బానిసలు గోతికాడి నక్కల్లా ఊళలు పెడుతున్నారు. ఆకాశంపై ఉమ్మేయొద్దు.
— Vijayasai reddy v (@VSReddy_MP) April 21, 2020