మాజీ మంత్రి, టీడీపీ నాయకుడు, ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన కొత్తపల్లి శామ్యూల్ జవహర్ రాజకీయాలపై సొంత పార్టీలోనే విమర్శలు వస్తున్నాయి. ``ఆయన కూడా ఫైర్ బ్రాండ్ అవ్వాలని అనుకుంటున్నారేమో.. అదేం కుదరేలా లేదు`` అంటూ సీనియర్ నేతల నుంచి వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఇంకొందరు నాయకులు.. ``ఇలాంటి వారి వల్ల పార్టీకి ప్రయోజనం లేదు. ఇలాంటి ప్రయోగాలు అనేకం అయిపోయాయి`` అని అంటున్నారు. దీంతో ఇప్పుడు జవహర్ విషయం టీడీపీలో ఆసక్తికరంగా మారింది. సాధారణంగా పెద్ద పెద్ద విమర్శలకు దూరంగా ఉండే జవహర్.. ఇటీవల కాలంలో ఒంటికాలిపై లేస్తున్నారు.
అధికార పార్టీ నేతలపైనా.. సీఎం జగన్పైనా ఆయన తీవ్ర విమర్శలు చేస్తున్నారు. కొన్ని కొన్ని సార్లు ఈ వ్యాఖ్యలు శృతిమించుతు న్నాయి. సీఎం జగన్ను నేరస్తుడు అని పార్టీ అధినేత చంద్రబాబు వ్యాఖ్యానించారు. దీనినే జవహర్ కూడా అందుకున్నారు. ఇక, ఇటీవల సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్రెడ్డి కుక్కతో పోల్చి మాట్లాడారు. కరిచే కుక్కలకు మేం సమాధానం చెప్పం అని వ్యాఖ్యానించారు. అదేవిధంగా మంత్రులను పందులతో పోల్చారు. పందులు ఎన్నున్నా.. ప్రయోజనం లేదు.. అన్నారు. ఇలా ఇటీవల కాలంలో ఆయన చేస్తున్న వ్యాఖ్యలు హద్దు దాటుతున్నాయని.. టీడీపీ నేతలే వ్యాఖ్యానిస్తున్నారు.
ప్రజల్లో పట్టు సాధించాలంటే.. ఇలా విమర్శలతో ముందుకు వెళ్లడం వల్ల ప్రయోజనం ఏముంటుంది? అనే ప్రశ్న వస్తోంది. తాను ఎదగాలనుకున్నప్పుడు ప్రజాసమస్యలపై పోరాటం చేయాలని.. అప్పుడు ప్రజల్లో నిలబడేందుకు అవకాశం ఉంటుందని సూచిస్తున్నారు. కానీ, గత ఎన్నికల్లో తిరువూరు నుంచి ఓడిపోయిన తర్వాత.. అక్కడ సమస్యలపై దృష్టి పెట్టలేదు. ఇక, వచ్చే ఎన్నికల్లో కొవ్వూరు నుంచి పోటీ చేయాలని అనుకుంటున్నా.. అక్కడి నేతలతోనూ కలుపుగోలుగా ఉండడం లేదు. రాష్ట్ర నేత అనే భావంతో ఆయన సీనియర్లనే మించిపోయి వ్యాఖ్యలు చేస్తున్నారని.. అంటున్నారు.
అంతేకాదు, ఇంతకు మించి ప్రజల్లో పట్టు సాధించేందుకు ప్రయత్నం చేయడం లేదని అంటున్నారు. ఇక్కడ చిత్రం ఏంటంటే.. వైసీపీ నేతలు మాత్రం జవహర్ మాటలను పట్టించుకోవడం లేదు. ఆయన ఏమన్నా కౌంటర్ రావడం లేదు. అంటే.. దీనిని బట్టి .. ఆయనను జూనియర్ నేతగానే చూస్తున్నారని అనుకోవాలా? లేక... అసలు నాయకుడే కాదని అనుకుంటున్నారా? అనే చర్చ కూడా టీడీపీలో సాగుతుండడం గమనార్హం. మరి జవహర్ ఎలాంటి ఆలోచనతో ఉన్నారో.. చూడాలి.