కరోనా రెండు వేవ్‌ల త‌రువాత ఇప్పుడిప్పుడే కాస్త తేరుకుంటుంద‌నుకున్న సమ‌యంలో దేశంలో మ‌రోసారి క‌రోనా విజృంభిస్తోంది. క‌రోనా కొత్త వేరియంట్ వ్యాప్తితో గ‌త కొన్ని వారాలుగా కొత్త కేసులు భారీగా పెరిగిపోతున్నాయి. ఈ క్ర‌మంలో మూడో వేవ్ వ‌స్తుంద‌న్న అంచ‌నాలు వ్య‌క్తం చేస్తున్న‌ నిపుణులు.. రాబోయే రెండు వారాలు కీల‌కం కానున్నాయ‌ని హెచ్చ‌రిస్తూ.. ప్ర‌భుత్వాలు, ప్ర‌జ‌లు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని చెబుతున్నారు. ఒమిక్రాన్ ప్ర‌భావంతో రాబోయే రెండు వారాల్లో భారీగా క‌రోనా కేసులు న‌మోద‌య్యే అవ‌కాశం ఉంద‌ని ప్ర‌పంచ ఆరోగ్యం సంస్థ ముఖ్య శాస్త్ర‌వేత్త సౌమ్య స్వామినాథ‌న్ పేర్కొన్నారు. అయితే, దేశంలో ఒమిక్రాన్ పాజిటివ్ కేసులు సంఖ్య పెరుగుద‌ల స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది.


   గ‌త కొద్ది రోజుల నుంచి ఒక్క సారిగా క‌రోనా కేసులు పెరిగిపోతున్నాయి. తాజాగా 24 గంట‌ల వ్య‌వ‌ధిలోనే 58వేల‌కు పైగా పాజిటివ్ కేసులు న‌మోద‌వ‌డం ఆందోళ‌న క‌లిగిస్తోంది. ముందు రోజుతో పోలిస్తే 55 శాతం కేసులు పెర‌గాయి. అత్య‌ధికంగా ఒమిక్రాన్ వ్యాప్తి మ‌హారాష్ట్ర‌, డిల్లీలో కొన‌సాగుతోంది. ఈ నేప‌థ్యంలో ఢిల్లీలో ఇప్ప‌టికే వీకెంట్ కర్ఫూ విధించింది అక్క‌డి ప్ర‌భుత్వం. ముంబ‌య్‌లో కూడా క‌ఠిన ఆంక్ష‌లు అమలు చేయాల‌ని మ‌హారాష్ట్ర ప్ర‌భుత్వం యోచిస్తోంది. మ‌రోవైపు క‌రోనా మ‌ళ్లీ విజృంభిస్తున్న వేళ.. నిబంధ‌న‌లు, ఆంక్ష‌ల‌తో మూడో ఉధృతిని అదుపులోకి తీసుకురావ‌చ్చ‌ని నిపుణులు అంచ‌నా వేస్తున్నారు.


  రోజుకు వేల సంఖ్య‌లో క‌రోనా కేసులు న‌మోద‌వుతున్న వేళ‌.. వ్యాక్సినేష‌న్‌ర ప్ర‌క్రియ వేగ‌వంతం చేయాల‌ని సూచిస్తున్నారు.  దేశ వ్యాప్తంగా మెట్రో న‌గ‌రాల‌తో పాటు, స‌మీప ప్రాంతాల్లో కొత్త‌గా న‌మోద‌వుతున్న పాజిటివ్ కేసుల్లో 50 శాతం వ‌ర‌కు కొత్త వేరియంట్ కేసులు ఉంటున్నాయ‌ని తెలుస్తోంది.  ఉన్న‌ట్టుండి కేసుల పెరుగుద‌ల చూస్తుంటే త్వ‌ర‌లోనే మూడో ఉధృతి  వ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని కొవిడ్ వ‌ర్కింగ్ గ్రూప్ చీఫ్ డాక్ట‌ర్ ఎన్‌కే అరోడా అభిప్రాయ‌పడ్డారు. అయినా.. భ‌యాందోళ‌న‌కు గుర‌వ్వాల్సిన అవ‌స‌రంలేద‌ని సూచించారు.  ఏది ఏమైనా మ‌రోసారి క‌రోనా వ్యాప్తి తీవ్రం అవుతున్న నేప‌థ్యంలో ప్ర‌జ‌లు, ప్ర‌భుత్వాలు అప్ర‌మ‌త్తంగా ఉంటూ త‌గిన జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌ని సూచిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: