మరోవైపు యుకేలో అయితే ఒమిక్రాన్ విజృంభిస్తోంది. ఒక్కరోజే 10వేలకు పైగా కేసులు రావడం ఆందోళన కలిగిస్తోంది. అలాగే ఒమిక్రాన్ మరణాల సంఖ్య7కు చేరింది. అంతకుముందు రోజు 3వేల 201 ఒమిక్రాన్ కేసులు రాగా ఏకంగా కేసుల సంఖ్య 3రెట్లు పెరిగింది. దీంతో ఆ దేశంలో మొత్తం ఒమిక్రాన్ బాధితుల సంఖ్య 24వేల 968కు చేరింది. అలాగే గత 24గంటల్లో 90వేల 148 కరోనా కేసులొచ్చాయి. 125మంది చనిపోయారు.
ఒమిక్రాన్ వేరియంట్ కరోనా ప్రపంచాన్ని చుట్టుముడుతోందని అమెరికాలోని అంటు వ్యాధుల నిపుణులు డా.ఆంటోనీ ఫౌచీ చెప్పారు. రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్నప్పటికీ ఈ వేరియంట్ సోకే ప్రమాదముందని.. తప్పకుండా బూస్టర్ డోసు తీసుకోవాలని అమెరికన్లకు విజ్ఞప్తి చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రయాణాలు చేయడం ఇన్ ఫెక్షన్ ముప్పును మరింత పెంచుతుందన్నారు. దీని కట్టడికి మాస్కులు ధరించడం, బూస్టర్ డోసు తీసుకోవడం మాత్రమే మార్గాలని చెప్పారు.
ఇక ఒమిక్రాన్ ఆందోళనలు నెలకొన్న కారణంగా కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియను ప్రభుత్వం వేగవంతం చేసింది. ఈ క్రమంలో కేంద్ర పాలిత ప్రాంతం అండమాన్ నికోబార్ దీవుల్లో 100వ్యాక్సినేషన్ పూర్తి చేశారు అక్కడి అధికారులు. దీంతో సంపూర్ణ వ్యాక్సినేషన్ సాధించిన ప్రాంతంగా ఈ దీవి రికార్డు సృష్టించింది. కొండలు, అడవులు దాటి వెళ్లి అండమాన్ నికోబార్ దీవుల్లో వ్యాక్సినేషన్ పెద్ద సవాల్ అని అక్కడి పాలక వర్గం తెలిపింది.