రెండో ప్రపంచ యుద్ధ సమయంలో తొలి న్యూక్లియర్ ఆయుధాన్ని కనుగొనేందుకు ఓ కీలక ఆపరేషన్ చేపట్టారు. ఆ ఆపరేషన్ పేరు మన్హట్టన్ ప్రాజెక్టు. ఇప్పుడు అలాంటి ప్రాజెక్టే తిరిగి మళ్ల తెరకెక్కింది? ఇప్పుడేమీ యుద్ధాలు లేకపోయినప్పటికీ... యుద్ధం సంభవించిన నాటి పరిస్థితులు ఆవిర్భవించేందుకు కారణం, కరోనా కలకలం. ప్రపంచవ్యాప్తంగా కొన్ని దేశాలను మినహాయిస్తే...మిగతా అన్ని చోట్ల ఈ మహమ్మారి వ్యాప్తి జరిగిపోయింది! ఇలాంటి తరుణంలో కరోనా వైరస్కు వ్యాక్సిన్ తయారీని వేగవంతం చేయడం, ఈ ఏడాది చివరి నాటికి దాన్ని అందుబాటులోకి తెచ్చేందుకు అగ్రరాజ్యం అమెరికా ఆపరేషన్ వార్ప్ స్పీడ్ చేపట్టింది. వైట్హౌజ్లోని రోజ్గార్డెన్లో జరిగిన మీడియా సమావేశంలో ఆపరేషన్ వార్ప్ స్పీడ్కు సంబంధించి వివరాలను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు. వ్యాక్సిన్ అభివృద్ధి పనులను మరింత వేగవంతం చేసేందుకు ఆపరేషన్ వార్ప్ స్పీడ్ చేపట్టినట్లు తెలిపిన అధ్యక్షుడు ట్రంప్ ఏడాది చివరిలోగా కరోనా వైరస్కు వ్యాక్సిన్ వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
ఆర్మీతో కలిసి ఆపరేషన్ వార్ప్ స్పీడ్ చేపట్టినట్లు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు. ``ఇది భారీ ఆపరేషన్ చాలా వేగంగా వ్యాక్సిన్ తయారీ పనులు జరుగుతున్నాయి`` అని ట్రంప్ వెల్లడించారు. ``వ్యాక్సిన్ తయారీలో సుమారు 14 మేటి కంపెనీలు ఉన్నాయి కానీ మా ప్రభుత్వం మాత్రం కేవలం కొన్ని కంపెనీల పైనే పెట్టుబడి పెట్టేందుకు ఆసక్తిగా ఉంది. ఈ ఆపరేషన్లో గ్లాక్సోస్మిత్క్లైన్ సీఈవో మోన్సెఫ్ స్లావోయి చీఫ్ అడ్వైజర్గా ఉంటారు. సైన్యం కూడా భాగస్వామ్యం అయిన ఈ ప్రోగ్రామ్లో యూఎస్ ఆర్మీ మెటీరియల్ కమాండ్కు చెందిన జనరల్ గుస్తావే పెర్నా చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్గా ఉంటారు.` అని డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు. కాగా, ఒకవేళ వ్యాక్సిన్ను కొనుగొన లేకపోయినా.. అమెరికా మాత్రం సాధారణ జీవన పద్ధతుల్ని అలవాటు చేసుకోవాల్సి వస్తుందని ట్రంప్ అన్నారు.