ఏపీలో నెలకొన్న తాజా పరిస్థితులపై ముఖ్యమంత్రి జగన్ సోమవారం మధ్యాహ్నం నుంచి మంత్రులు, ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహిస్తున్నారు. ఏపీలో కరోనా వైరస్ వ్యాప్తి నిరోధానికి తీసుకుంటున్న చర్యలు, తీసుకోవాల్సిన నిర్ణయాలు తదితర అంశాలపై ముఖ్యమంత్రి జగన్ సమీక్ష నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలో జోన్ల వారీగా అంటే రెడ్, ఆరెంజ్, గ్రీన్ జోన్ల వారీగా ఎలాంటి ప్రణాళికను అమలు చేయాలన్న అంశాలపై చర్చిస్తున్నారు. అంతేగాకుండా.. ఏప్రిల్ 14తో లాక్డౌన్ ముగుస్తున్న క్రమంలో రాష్ట్రం పరంగా ఎలాంటి వ్యూహంతో ముందుకు వెళ్లాలన్న అంశాలపై కూడా చర్చించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.
ఒక వేళ కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఒకే రీతిలో లాక్డౌన్ను పొడిగిస్తే.. ఏపీలో ఎలా ముందుకు వెళ్లాలన్న దానిపై ప్రధానంగా చర్చ జరుగుతున్నట్లు సమాచారం. నిజానికి.. గ్రీన్ జోన్లలో లౌక్డౌన్ సడలింపులు ఇవ్వాలని ఇటీవల ప్రధాని మోడీని కూడా ముఖ్యమంత్రి జగన్ కోరిన విషయం తెలిసిందే. ప్రధానంగా వ్యవసారంగం, దాని అనుబంధ రంగాలను దృష్టిలో పెట్టుకుని ఆయా ప్రాంతాల్లో సడలింపులు ఇవ్వాలని ఆయన కోరారు. అయితే.. ఈ రోజునిర్వహిస్తున్న సమావేశంలో ముఖ్యమంత్రి జగన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది అందరిలో ఉత్కంఠను రేపుతోంది.