చనిపోయిన బిడ్డను తరలించేందుకు అంబులెన్స్ అడిగితే ఇవ్వని పాషాణ ప్రభుత్వం జగన్‌దని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విమర్శించారు. ఆసుపత్రులు మెరుగుపరచరుగానీ రాజధానిగా అభివృద్ధి చేసేస్తారట అంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వెటకారం ఆడారు. బిడ్డ మృతదేహంతో 120కి.మీ. మోటార్ సైకిల్ మీద వెళ్ళిన ఆ గిరిజన దంపతులకు వైసీపీ సీఎం క్షమాపణలు చెప్పాలని పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు.


విశాఖపట్నం కె.జి.హెచ్.లో మృతి చెందిన నవజాత శిశువును స్వస్థలానికి చేర్చేందుకు అంబులెన్స్ ఇవ్వకుండా ఇబ్బందిపెట్టడంతో ఆ బిడ్డ తల్లితండ్రులు  120 కి.మీ. చిన్నపాటి ద్విచక్ర వాహనం మీద మృతదేహాన్ని తీసుకువెళ్లడం తీవ్ర ఆవేదన కలిగించిందని పవన్ కళ్యాణ్ తెలిపారు. పాడేరు ప్రాంతం ముంచింగుపుట్టు మాండ్లమ్ కుమడ గ్రామానికి చెందిన శ్రీమతి మహేశ్వరి, శ్రీ కొండబాబు దంపతులు పుట్టెడు శోకాన్ని దిగమింగుకొని ఆ శిశువు మృతదేహాన్ని తీసుకువెళ్లారని.. ఆ దంపతుల వేదన విన్న ఎవరికైనా గుండె కరుగుతుందని పవన్ కళ్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు.


పాషాణ ప్రభుత్వంలో మాత్రం స్పందన ఉండదని... కేజీహెచ్ లో గిరిజనులకు సాయపడేందుకు ఎస్టీ సెల్ ఉన్నా, ఆసుపత్రిలో ఉన్నతాధికారులు ఉన్నా పట్టించుకోకపోవడం అమానవీయమని పవన్ కళ్యాణ్ అన్నారు. ఆస్పత్రుల నిర్వహణ, ప్రజారోగ్యంపై పాలకులు ఎంత శ్రద్ధ చూపుతున్నారో అర్థం చేసుకోవచ్చన్న పవన్ కళ్యాణ్..  బిడ్డ మృతదేహంతో 120కి.మీ. మోటార్ సైకిల్ మీద వెళ్ళిన ఆ గిరిజన దంపతులకు వైసీపీ సీఎం జగన్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.


ఈ తరహా ఘటన మన రాష్ట్రంలో మొదటిది కాదన్న పవన్ కళ్యాణ్.. కొద్ది నెలల కిందటే తిరుపతి రుయా ఆసుపత్రి నుంచి బిడ్డ మృతదేహాన్ని తరలించేందుకు ఓ తండ్రిపడ్డ ఆవేదనను రాష్ట్ర ప్రజలు మరచిపోలేదన్నారు. మచిలీపట్నం సముద్ర తీరంలో ఓ బాలుడు చనిపోతే ఆ బిడ్డ మృతదేహాన్ని బంధువులు బైక్ మీద తీసుకువెళ్లారని... ఆసుపత్రుల్లో ఉన్న మహాప్రస్థానం వాహనాల పథకం ఏమైందని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: