అప్పుల అప్పారావు సినిమా లో రాజేంద్ర ప్రసాద్ చెప్పిన “అప్పుడే తెల్లారిందా..?” అనే డైలాగ్ మన అందరికీ గుర్తే. అప్పు చేసుకున్నవాడికి నిద్ర అంత సులభంగా రాదని అందులో దాగి ఉంది. కానీ ఈ రోజుల్లో అప్పు చేయని వారు వింతగా కనిపించే పరిస్థితి వచ్చింది. ప్రతి ఇంటిలోనూ, ప్రతి మనసులోనూ ఒక “అప్పుల అప్పారావు” కూర్చున్నాడు. ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ పరిస్థితి మరింత తీవ్రమైంది. ఇది మాటల్లో కాదు - కేంద్ర గణాంకాల శాఖ విడుదల చేసిన తాజా నివేదిక ప్రకారం, దేశంలో అత్యధిక అప్పులు చేసుకున్న రాష్ట్రాల జాబితాలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మొదటి రెండు స్థానాలు దక్కించుకున్నాయి. 2021–22 ఆర్థిక సంవత్సర లెక్కల ప్రకారం ఏపీలో 43.7% మంది, తెలంగాణలో 37.2% మంది అప్పుల బారిన పడ్డారు. అంటే, ఈ రాష్ట్రాల్లో ప్రతి రెండు కుటుంబాల్లో ఒకటి అప్పుల భారం మోస్తోంది అన్నమాట.


ఎందుకింత పరిస్థితి? .. ప్రభుత్వాలు ప్రజలకు నేరుగా డబ్బులు బదిలీ చేసే సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాయి. కానీ అదే సమయంలో ప్రజలు కూడా ఆ సబ్సిడీలతో సరిపెట్టుకోకుండా మరింత ఎక్కువ ఖర్చులు చేస్తున్నారు. పెరుగుతున్న జీవిత వ్యయం, ప్రైవేట్ విద్య, వైద్య ఖర్చులు – ఇవన్నీ సాధారణ కుటుంబాలను అప్పుల దారిలో నెట్టేస్తున్నాయి. దక్షిణాదే టాప్‌లో! .. ఆంధ్ర, తెలంగాణ తర్వాత కేరళ 29.9%, తమిళనాడు 29.4%, కర్ణాటక 23.2% శాతంతో ఉన్నాయి. అంటే మొత్తం దక్షిణాది రాష్ట్రాలే అప్పుల పట్టికలో టాప్ ఫైవ్లో ఉన్నాయి. మరోవైపు ఉత్తర భారతదేశం, ఈశాన్య రాష్ట్రాల్లో పరిస్థితి చాలా బాగుంది. ఢిల్లీ (3.4%), చత్తీస్‌ఘడ్ (6.5%), అసోం (7.1%) లాంటి రాష్ట్రాల్లో అప్పుల భారమే తక్కువ. అంటే ఆర్థిక పరంగా అక్కడి ప్రజలు మరింత స్థిరంగా ఉన్నారని అర్థం.



ఇక ఆలోచించాల్సిన సమయం వచ్చింది! .. ఈ గణాంకాలు నాలుగేళ్ల క్రితివి అయినప్పటికీ, అప్పుల ట్రెండ్ మారలేదని నిపుణులు అంటున్నారు. వ్యయాలు పెరిగి, ఆదాయాలు స్థిరంగా ఉండడంతో, అప్పు చేయడం జీవనశైలిలో భాగమైపోయింది. ప్రభుత్వాలు సంక్షేమ పథకాల ద్వారా ఉపశమనం కల్పించినా, ప్రజలు ఖర్చు తీరు మార్చుకోకపోతే పరిస్థితి మరింత దారుణం అవుతుందని హెచ్చరిస్తున్నారు. సంక్షిప్తంగా చెప్పాలంటే - “అప్పుల అప్పారావులు” ఇక సినిమాల్లోనే కాదు, ప్రతి ఇంట్లోనూ కనిపించే స్థితి వచ్చింది. అప్పు చేయడం సులభం కానీ తీర్చడం కళ. ఈ కళలో మన తెలుగు రాష్ట్రాల ప్రజలే అగ్రగాములు కావడం ఆలోచించాల్సిన విషయమే!

మరింత సమాచారం తెలుసుకోండి: