తెలుగు దేశం అధినేత ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై తెలుగు దేశం పార్టీ పార్లమెంటు సభ్యుడు జేసీ దివాకర్ రెడ్డి అత్యంత నిజాలతో కూడిన సెటైర్లు వేశారు. చంద్రబాబు సర్వకాల సర్వావస్థలలో అధికారులపై ఆధారపడతారని అలా అధికారులపై ఆధారపడటం ముఖ్యమంత్రిగా సరికాదన్నారు.
తాను ఎప్పుడు వెళ్లినా ఎవరో ఆర్డీవో దగ్గర నుంచి మొదలు ఐఏఎస్ అధికారుల వరకు ముఖ్యమంత్రి 'టెలికాన్ఫరెన్స్" లతో ఉంటూ ఉన్నారని తనకు సమాచారం అందే దని ఆ టెలికాన్ఫరెన్స్ లను ఇకనైనా ఆపేసి అధికారులను, మత్రులను, ప్రజా ప్రతినిధులను వారిపని వారిని చేసుకోనివ్వాలని నారా చంద్రబాబు నాయుడుని మహానాడు వేదిక సాక్షిగా కోరారు.
అవసరమైతే కేవలం కలెక్టర్లతో మాత్రమే చంద్రబాబు టెలి-కాన్ఫరెన్స్ లు నిర్వహించాలని ఆయన కోరారు. సామాన్య వ్యక్తులు ఎవరూ సిఎం వద్దకు వచ్చి వాస్తవ విషయా లు చెప్పుకోలేరని, తాను క్షేత్రస్థాయిలో పరిస్థితిని వివరించానని, మరోసారి నారా చంద్రబాబు నాయుడు మాత్రమే ముఖ్యమంత్రి కావాలన్నదే తన కోరికని జేసీ దివాకర రెడ్డి అన్నారు.
ప్రతి శుక్రవారం కోర్ట్ కు హాజరయ్యే వైఎస్ జగన్ రెడ్ది ఎప్పటికి ముఖ్యమంత్రి కాలేడని ఆయన అనేక సందర్బాల్లో అన్నారు.
జగన్ను ఎంత తీవ్రంగా విమర్శించారో. చంద్రబాబును అంతగాఆ ఆకాశానికెత్తారు జేసీ దివాకర్ రెడ్డి. చంద్రబాబు ప్రధాని పదవి వద్దనకూడదన్నారు. లోకేష్ సీఎం అయితే తప్పే లేదన్నారు. ఒకే పని కోసం 29సార్లు ఢిల్లీ చుట్టూ తిరిగిన సీఎం ఎవరూ లేరని ఢిల్లీ సాయం కోసం అంతగా ప్రయత్నించారన్నారు.
పోలవరం కోసం ప్రోటోకాల్ ను కూడా పక్కన పెట్టి సీఎం గడ్కరీ ఇంటికి వెళ్లారని గుర్తు చేసుకున్నారు. ప్రతి ఎకరాకు నీళ్లు రావాలి..ఏపీ సౌభ్యాగ్యంగా ఉండాలని చంద్రబాబు ఆశ పడతారన్నారు. కియాను గుజరాత్లో పెట్టాలంటూ ప్రధాని ఒత్తిడి తెచ్చారని, కియా ప్రతినిధులకు ప్రధాని ఐదుసార్లు ఫోన్ చేశారని జేసీ ప్రకటించి కలకలం రేపారు.
చంద్రబాబు పాలనా విధానాల వల్ల అనంతపురంలో రైతులు ఎకరాకు లక్ష రూపాయలు సంపాదించుకుంటున్నారని జేసీ సంతోషం వ్యక్తం చేశారు. దేశంలోనే అత్యల్ప వర్షపాతం ఉన్న, అనంత జిల్లా కోనసీమగా మారిందన్నారు. బ్రహ్మసముద్రం ప్రాజెక్టు పూర్తయితే కోనసీమను కూడా మించిపోతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఎవరికైనా అనుమానాలు ఉంటే అనంత జిల్లాకు వచ్చి చూడాలని సవాల్ చేశారు. కియా వచ్చాక అనంత జిల్లా రూపురేఖలు మారిపోయాయనన్నారు.
అన్నీ చెప్పిన జేసీ.. చంద్రబాబుకు కొన్ని సూచనలు కూడా చేశారు. చంద్రబాబు మూలవిరాట్టని, మంత్రులు, ఎమ్మెల్యేలు రమణ దీక్షితుల్లా తయారయ్యారని సెటైర్లు వేశారు. చివరిగా జగన్ వస్తే ఏపీకి భవిష్యత్ ఉండదని, చంద్రబాబు పక్కన ఎవరున్నారో, జగన్ పక్కన ఎవరు ఉన్నారో చూడాలని ప్రజలకు సలహా ఇచ్చారు జగన్ పక్కన పీకలు కోసే మంగలి కృష్ణ లాంటి వారుంటారన్నారు.
చంద్రబాబు కోసం కాదు, మీ కోసం, మీ పిల్లల కోసం, టీడీపీకి ఓటు వేయాలని చివరిలో జేసీ పిలుపు నిచ్చారు. మొత్తానికి జేసీ ప్రసంగం కొనసాగుతున్నంత సేపు, మహానాడు మొత్తం సైలెన్స్ అయిపోయింది. అందరూ ఆసక్తిగా విన్నారు. చంద్రబాబు కూడా ముసిముసి నవ్వులతో జేసీ ప్రసంగాన్ని ఆలకించారు.
మొత్తం మీద జెసి దివాకరరెడ్డి చంద్రబాబుకు వందిమాగదుడుగా కొంతసేపు, విదూషకుడుగా కొంతసేపు మాట్లాడారు. ఆయన బుద్దిమాంద్యంతో బాధపడుతున్నారని జనం జోకులు వేసుకుంటున్నారు.