ఇపుడు కూడా అలాంటి చర్చ ఒకటి సాగుతోంది. అది కూడా జాతీయ స్థాయిలో. ఎందుకంటే గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు జరిగాయి. పోలింగ్ మాత్రం తుస్సుమంది. తాజాగా జరిగిన కార్పొరేషన్ ఎన్నికల్లో మొత్తం ఓటర్లలో మూడవ వంతు తమ ఓటు హక్కుని ఉపయోగించుకున్నారు. రెండు వంతుల మంది కేవలం ప్రేక్షకులు అయ్యారు. అంటే ఇది నిజంగా వింతా విడ్డూరమే కదా.
నిజానికి ప్రతీ ఎన్నికల్లో రెండు వంతుల మంది పోలింగునకు వస్తారు. మిగిలిన వారు దూరంగా ఉంటారు. అలా మెజారిటీ ఓటర్లు పోలింగు బూతులకు కదిలారు అన్న విశ్వాసం అయినా ప్రజాస్వామ్యానికి ఉండేది. ఇపుడు చూస్తే పూర్తిగా ఉల్టా సీదా. వచ్చిన వారు తక్కువ మంది వారి నుంచే కోటి జనాభా కలిగిన భాగ్యనగరం భావి రాజుని ఎన్నుకోవాలి.
ఇపుడు ఇదే దేశంలో కూడా చర్చగా ఉందిట. ఇంతటి మెగా సిటీకి ఏమైంది. ఎందుకు జనాలు రారు, ఓటెందుకు వేయరూ ఇదే జాతీయ స్థాయిలోనూ ప్రశ్నల వర్షం కురిపిస్తోంది. ఇక హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికల గురించి ఆలోచిస్తే గ్రేటర్ అయ్యాక ఇది మూడవ ఎన్నిక. 2009లో జరిగిన ఎన్నికలో కేవలం 42 శాతం మాత్రమే ఓటు చేశారు. 2016లో జరిగిన ఎన్నికల్లో చూసుకుంటే అది 45 శాతంగా ఉంది. ఈసారి కచ్చితంగా 60 శాతం పైగానే ఓటింగ్ ఉంటుంది అని అంతా అంచనా వేశారు. కానీ 35 శాతం దగ్గరే నంబర్ ఆగిపోయింది. అంటే తన రికార్డుని తానే గ్రేటర్ హైదరాబాద్ బద్దలుకొట్టిందన్న మాట. మరి ఇదే తీరున సాగితే ముందు ముందు మరింత దారుణంగా పోలింగు శాతం పడిపోతుందా అని డౌట్స్ వస్తున్నాయట.