అనంతపురం జిల్లాలో మరోసారి జేసీ ప్రభాకర్ రెడ్డి వ్యవహారం టీడీపీకి తలనొప్పిగా మారింది. తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ అయిన ఆయన ఎప్పుడూ వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలుస్తుంటారు. కానీ ఈసారి పరిస్థితి పార్టీకి సీరియస్ ఇబ్బందిగా మారిందని సమాచారం. జేసీ వ్యాఖ్యలు, ప్రవర్తనపై జిల్లాలోని పలువురు టీడీపీ సీనియర్ నేతలు నేరుగా చంద్రబాబు నాయుడుకు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. వారి వాదన ప్రకారం - ప్రభాకర్ రెడ్డి మాటలు, చర్యలు తాడిపత్రి పరిధిని దాటి జిల్లాలో పార్టీ ఇమేజ్‌ను దెబ్బతీస్తున్నాయట. “ఆయనను కట్టడి చేయకపోతే పార్టీకి నష్టం తప్పదు” అనే హెచ్చరికలే ఇప్పుడు చంద్రబాబు చెవిలో పడినట్లు సమాచారం. ముఖ్యంగా జేసీ ఇటీవల చేసిన ఐపీఎస్ అధికారి రోహిత్ కుమార్ చౌదరిపై వ్యాఖ్యలు పరిస్థితిని మరింత క్లిష్టంగా మార్చేశాయి.


ప్రజల్లో టీడీపీ పట్ల ప్రతికూల భావన కలిగే అవకాశం ఉందని జిల్లాలోని పలువురు నేతలు స్పష్టంగా చెప్పారు. ఒంగోలు వెళ్లి అక్కడ కూడా వివాదం సృష్టించడం, ఇతర నియోజకవర్గాల రాజకీయాల్లో జోక్యం చేసుకోవడం — ఇవన్నీ పార్టీ లైన్‌ను దాటిన చర్యలుగా చంద్రబాబు పరిగణించినట్లు తెలుస్తోంది. మరోవైపు, తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డికి సూచనలు ఇవ్వాలని చంద్రబాబు భావిస్తున్నారు. లండన్ పర్యటన నుంచి తిరిగొచ్చిన వెంటనే అస్మిత్ రెడ్డిని పిలిపించి “మీ తండ్రి వ్యవహారంపై కంట్రోల్ పెట్టాలి, పార్టీకి ఇబ్బంది రాకుండా చూడాలి” అంటూ స్పష్టమైన సూచనలు ఇవ్వాలని నిర్ణయించుకున్నారట. ఇక జేసీ చేసిన వివాదాల పట్ల జిల్లాలోని ఇతర నాయకులు కూడా అసంతృప్తిగా ఉన్నారు. కేతిరెడ్డి పెద్దారెడ్డితో జేసీ మధ్య జరిగే ఘర్షణను “ఇది రెండు కుటుంబాల విషయం” అని పెద్దగా పట్టించుకోలేదు. కానీ రోహిత్ కుమార్ చౌదరిపై చేసిన విమర్శలు మాత్రం ప్రభుత్వ, ప్రజా వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి.



ఇదే సమయంలో ప్రభుత్వం కూడా కౌంటర్‌ అడుగు వేసినట్లు టాక్. ఏఎస్పీ రోహిత్ కుమార్ చౌదరి పదవీకాలాన్ని మరో ఏడాది పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీని వెనుక కూడా జేసీ నోటికి కళ్లెం వేయడమే కారణమని తాడిపత్రి రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. ఇక జిల్లా ఎస్పీ కూడా జేసీకి అపాయింట్‌మెంట్ ఇవ్వడం మానేశారని, ప్రభుత్వ పెద్దల నుంచి కూడా స్పష్టమైన సంకేతాలు వచ్చినట్లు సమాచారం. మొత్తం మీద, జేసీ ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యలు ఇప్పుడు టీడీపీకి కొత్త సవాల్‌గా మారాయి. చంద్రబాబు ఈసారి కఠిన చర్యలు తీసుకుంటారా లేక సైలెంట్‌గా డ్యామేజ్ కంట్రోల్ చేస్తారా? అనేది ఇప్పుడు తాడిపత్రి నుండి అమరావతి వరకు చర్చగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: