ఆర్టికల్ 370 రద్దు తరువాత జమ్మూ కాశ్మీర్లో వాతావరణం పూర్తిగా మారిపోయింది. ఆగష్టు నెలలో ప్రజలు కొంతమేర అర్ధం చేసుకోవడానికి ఇబ్బందులు పడ్డారు. ఆ తరువాత ఆర్టికల్ 370 రద్దుతో వచ్చే లాభాలు చూసి సర్దుకుపోయారు. ఇప్పుడు పూర్తిగా ప్రశాంతంగా ఉన్నది అక్కడి వాతావరణం. అయితే, జమ్మూ కాశ్మీర్ లోని నాయకులను మాత్రం గృహనిర్బంధం చేశారు. దీనికి కారణాలు ఉన్నాయి. జమ్మూ కాశ్మీర్లో శాంతియుత వాతావరణం తీసుకురావాలి అంటే తప్పనిసరిగా అక్కడ అలాంటి వాతావరణ పరిస్థితులు నెలకొల్పాలి.
అందుకే కొన్ని రోజులపాటు నాయకులకు గృహనిర్బంధం తప్పనిసరి. వేర్పాటు వాదులతో కలిసి తిరిగి రాష్ట్రంలో ఇబ్బందులు కలిగిస్తే.. చాలా దారుణమైన పరిస్థితులు నెలకొంటాయి. కాబట్టి వాటి నుంచి బయటకు రావాలి అంటే తప్పనిసరిగా వారిని గృహనిర్భందంలోనే ఉంచాలి. అయితే, గృహనిర్బంధంలో ఉంచినా వాళ్లకు కావాల్సిన అన్ని సౌకర్యాలను ప్రభుత్వం కల్పిస్తోందని, ఎలాంటి ఇబ్బందులు రాకుండా వీఐపీలుగా చూసుకుంటుందని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ పేర్కొన్నారు.
జమ్మూ కాశ్మీర్ లో తిరిగి శాంతియుత వాతావరణం నెలకొల్పడమే ప్రధాన లక్ష్యం అని చెప్పారు. 1947 లో ఉన్న ఇండియాను తిరిగి సాధించుకోవడమే లక్ష్యంగా పెట్టుకున్నట్టు చెప్పారు. 1994లో దీనిపై అప్పటి కాంగ్రెస్ పార్టీ ఓ తీర్మానం చేసిందని, ఆ తీర్మానానికి కట్టుబడి ఉన్నట్టుగా జితేందర్ సింగ్ పేర్కొన్నారు. అదే తీర్మానాన్ని పార్లమెంట్ లో ఆమోదించారని కూడా చెప్పారు.
త్వరలోనే ఇండియా భౌగోళిక స్వరూపం మారిపోతుందని, పీవోకే ఇండియాలో తిరిగి విలీనం అవుతుందని పేర్కొన్నారు. పాకిస్తాన్ స్వయంగా పీవోకేను తిరిగి అప్పగించే రోజులు వస్తాయని మంత్రి చెప్పడం విశేషం. ప్రతి భారతీయుడు దానిగురించి ఆలోచిస్తున్నాడు. అఖండ భారతావని సాధ్యమైతే.. ఇండియా ప్రపంచంలో సూపర్ పవర్ గా ఎదుగుతుంది. అందులో ఎలాంటి సందేహం అవసరం లేదు. అది ఎప్పుడు సాధ్యం అవుతుందో చూడాలి.