
నవంబర్లో జరుగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో ఆమీతుమీకి డెమోక్రాట్ పార్టీ అభ్యర్థి జో బిడెన్ సిద్ధమయ్యారు. అయితే అధ్యక్ష ఎన్నికలు నల్లేరు మీద నడక కాకపోవడంతో జో బిడెన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. జాతి సమానత్వానికి చిహ్నంగా కమలాదేవిని డెమోక్రాట్ పార్టీ వర్ణిస్తోంది. కమలాదేవిలో ఇండో-ఆఫ్రికన్ సంతతికి మూలాలు ఉండటం డెమోక్రాట్ పార్టీకి కలిసొచ్చే అంశం. అమెరికాలో జాతి వివక్ష జరగదని కమలాదేవి హారిస్ అభ్యర్థిత్వంతో రుజువు చేయాలని ప్లాన్ చేస్తున్నారు అదే సమయంలో, ఈ స్కెచ్లో అమెరికాలోని భారతీయులను, అలాగే నల్లజాతీయులను బుట్టలో వేసుకోనున్నారని రాజకీయ నిపుణులు భావిస్తున్నారు.
ఇటీవలి జార్జ్ ఫ్లాయిడ్ హత్య తర్వాత నల్లజాతీయులకు రిపబ్లికన్లపై వ్యతిరేకత పెరిగింది. దీనిని డెమోక్రాట్లు సద్వినియోగం చేసుకోవాలని భావిస్తున్నారు. భారతీయ సంతతికి చెందిన ప్రజలు సాధారణంగా డెమోక్రాట్ల మద్దతుదారులుగా భావిస్తారు. అందుకే బరాక్ ఒబామా, జో బిడెన్, హిల్లరీ క్లింటన్.. ఇలా అందరూ భారతీయులపై దృష్టి పెట్టారు. ట్రంప్ ఇటీవల హెచ్ -1 బీ వీసాలపై కఠినమైన నిషేధాన్ని ప్రకటించినప్పుడు.. మార్పు చేయాలని డెమోక్రాట్లు డిమాండ్ చేశారు. కమలాదేవిని ఉపాధ్యక్ష అభ్యర్థిగా చేయడం ద్వారా భారతీయులు, ఆఫ్రికన్ సంతతి పౌరులకు రిపబ్లికన్ పార్టీ నుంచి పూర్తిగా భిన్నంగా భావిస్తున్నారని సందేశం పంపాలని డెమోక్రాటిక్ పార్టీ కోరుకుంటోంది.