దేశంలో కరోనా కేసుల సంఖ్య భారీగా పెరిగిపోతోంది. కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. గత 24 గంటల్లో దేశంలో 9,971 మందికి కొత్తగా కరోనా సోకింది. దేశంలో ఒక్కరోజులో నమోదైన అత్యధిక కేసులు ఇవే. అదే సమయంలో 287 మంది మరణించారు. ఇండియాలో కరోనా సంక్షోభం మార్చి 2న ప్రారంభమైంది. ఇప్పటికే కేసుల సంఖ్య రెండు లక్షలను దాటి పరుగులు పెడుతోంది. ఈ మహమ్మారి ఎప్పుడు అంతమవుతుందన్న విషయమై డీజీహెచ్ఎస్ కు చెందిన డిప్యూటీ డైరెక్టర్ జనరల్ అనిల్ కుమార్, డిప్యూటీ అసిస్టెంట్ డైరెక్టర్ రూపాలీ రాయ్, ఓ మ్యాథమేటికల్ మోడల్ సాయంతో అంచనాలు వేశారు.
కరోనా వలన మరణించిన మరియు కరోనానుంచి కోలుకున్న వారి మొత్తం సంఖ్య.. కొత్తగా నమోదవుతున్న కేసులతో సమానమైనప్పుడు, కరోనా అంతం మొదలైనట్టని అనిల్ కుమార్, రూపాలీ వెల్లడించారు. దేశంలో కరోనా కేసుల సంఖ్య ఇప్పటివరకు మొత్తం 2,46,628కి చేరగా, మృతుల సంఖ్య 6,929 కి చేరుకుంది. 1,20,406 మందికి ఆసుపత్రుల్లో చికిత్స అందుతోంది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 1,19,293 మంది కోలుకున్నారు. కరోనా వైరస్కు వ్యాక్సీన్ తయారు చేసేందుకు ప్రపంచవ్యాప్తంగా పరిశోధనలు కొనసాగుతున్నాయి. మన దేశంలోనూ నియంత్రణకు ముమ్మర ప్రయత్నాలు జరుగుతున్నాయి.
తాజాగా కరోనా నిర్ధారణ కోసం రూపొందించిన కొత్త పరీక్ష విధానం బాధితులకు ఎంతో ఉపశమనం కలిగించనుంది. పరీక్షలు చేసి ఫలితాల కోసం ఎక్కువ సమయం ఎదురు చూడకుండా ఈ పద్ధతిలో కేవలం అరగంటలోనే ఫలితాలు వస్తాయని సైంటిస్టులు అంటున్నారు. కేవలం రూ.300 మాత్రమే. ఈ కొత్త వైద్య పరీక్ష విధానాన్ని హైదరాబాద్ లోని నిమ్స్, ఈఎస్ఐ దవాఖానలు సంయుక్తంగా రూపకల్పన చేశాయి. కాగా, ఐసీఎంఆర్ అనుమతి కోసం ఎదురు చూస్తున్నట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. అయితే ఈ కొత్త విధానంలో హైదరాబాద్ మేయర్ బొంతు రామ్మోహన్ కరోనా టెస్ట్ చేయించుకున్నారు. వైద్య పరీక్షల్లో ఆయనకు నెగటివ్ గా నిర్ధారణ అయింది.