తెలంగాణలో కొత్త మద్యం రిటైల్ దుకాణాల లైసెన్సుల కోసం దరఖాస్తుల ప్రక్రియ ఈసారి ఆశించినంతగా లేదు. 2025–27 లైసెన్స్ కాలానికి మొత్తం 2,620 రిటైల్ వైన్ షాపులకు దరఖాస్తులు ఆహ్వానించినా ఇప్పటి వరకు  కేవలం 2,000 దరఖాస్తులు మాత్రమే వచ్చాయి. సెప్టెంబర్ 26న ప్రారంభమైన దరఖాస్తు ప్రక్రియ అక్టోబర్ 18తో ముగియనుంది, అంటే ఇంకా వారం రోజులు మాత్రమే గడువు ఉంది. కానీ గతంలో 2023–25 లైసెన్స్ కాలానికి వచ్చిన స్పందనతో పోలిస్తే ఈసారి పరిస్థితి పూర్తిగా రివ‌ర్స్‌లో ఉంది. 2023లో, మొత్తం 98,900 మంది దరఖాస్తు చేసుకున్నారు. అప్పట్లో అప్లికేషన్ ఫీజు రూ.2 లక్షలు మాత్రమే ఉండటంతో ప్రభుత్వానికి దాదాపు రు. 2,600 కోట్లు ఆదాయం వచ్చింది. ఈసారి అదే సంఖ్యలో దరఖాస్తులు వస్తే ప్రభుత్వం మరింత ఆదాయం పొందుతుందని భావించారు. కానీ ఈసారి ఇప్పటి వరకు స్పందన తక్కువగా ఉండడం ఎక్సైజ్ శాఖను ఆందోళనకు గురి చేస్తోంది.


ప్రస్తుత లైసెన్స్ దరఖాస్తు ఫీజు రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షలకు పెంచడం ప్రధాన కారణంగా పేర్కొంటున్నారు. ఇది నాన్ - రిఫండబుల్ కావడంతో, దరఖాస్తుదారులు ఆలోచించి ముందడుగు వేస్తున్నారని తెలుస్తోంది. అంతేకాక, గత కొన్నేళ్లలో లాభాలు త‌గ్గిపోవ‌డం, మద్యం వ్యాపారంపై పెరిగిన పన్నులు, పోటీ పెరగడం కూడా వ్యాపారుల నిర్ణయాన్ని ప్రభావితం చేస్తున్నాయని అంటున్నారు. కరీంనగర్ జిల్లాలో 94 వైన్ షాపులు కేటాయించాల్సి ఉండగా, ఇప్పటివరకు పదిలోపే దరఖాస్తులు వచ్చినట్టు సమాచారం. ఈ పరిస్థితి ఇతర జిల్లాల్లోనూ కనిపిస్తోంది. దరఖాస్తుల తక్కువ సంఖ్య కారణంగా ప్రభుత్వ ఆదాయంపై ప్రభావం పడే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.


అయితే ఎక్సైజ్ వర్గాల ప్రకారం, మద్యం వ్యాపారులు ఎప్పుడూ ముందుగా మార్కెట్ పరిస్థితిని అంచనా వేసి, చివరి రోజుల్లోనే దరఖాస్తులు వేస్తారని చెబుతున్నారు. ఎక్కడ పోటీ తక్కువగా ఉంటుందో, ఏ ప్రాంతంలో లాభం ఎక్కువగా ఉంటుందో పరిశీలించి నిర్ణయం తీసుకుంటారని వారు అంటున్నారు. కాబట్టి ఇప్పుడే స్పందన తక్కువగా ఉందని చెప్పడం తగదంటున్నారు. ఏదేమైనా, అక్టోబర్ 18తో దరఖాస్తు గడువు ముగియనుండగా, అక్టోబర్ 23న లాటరీ విధానంలో షాపులు కేటాయించనున్నారు. చివరి రోజుల్లో దరఖాస్తులు పెరిగే అవకాశం ఉన్నప్పటికీ, అప్లికేషన్ ఫీజు పెంపు ప్రభావం మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. దీనితో రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం ఎంతవరకు తగ్గుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: