ఇప్ప‌టి వ‌ర‌కు కలకత్తా - చెన్నై, హైదరాబాద్ - కలకత్తా హైవే మీదుగా ఎవరు ప్రయాణం చేయాల్సి వచ్చినా విజయవాడ నగరం మీదుగానే ప్రయాణించవలసిందే. చాలా మంది ఫ్యామిలీతో కలిసి ప్రయాణించే వారు ఎలాగూ విజయవాడ మీదుగానే వెళ్తున్నాం కదా ఒక గంట ఆలస్యం అయినా పర్లేదు.. బెజ‌వాడ‌లో ఉన్న క‌న‌క దుర్గ‌మ్మ‌ అమ్మవారిని దర్శించుకుని వెళదామని అనుకుంటారు. ముఖ్యంగా ఆడవాళ్ళు అయితే అమ్మవారి దర్శనం కావలసిందే అని పట్టుబడతారు. ఇప్పుడు పూర్తిగా విజయవాడ నగరం గొల్లపూడి నుండి 5km, అటు గన్నవరం నుండి 15km దూరం నుండే విజయవాడ నగరానికి సంబంధం లేకుండా వేసిన ఔటర్ రింగ్ రోడ్డు వల్ల విజయవాడ నగరం మీదుగా వెళ్ళే అవసరం లేకుండా పోతుంది.


మ‌రీ ముఖ్యంగా గోదావరి, ఉత్తరాంధ్ర జిల్లాలకు వెళ్ళే వారికి సుమారు ఒక 40 నిముషాల సమయం ఆదా అవుతుంది. అందువల్ల విజయవాడ నగరానికి వచ్చే  వాహనాల రాకపోకలు చాలావరకు తగ్గుతాయి. అయితే ఈ ప్ర‌భావం విజ‌య‌వాడ మీద ప‌డుతుంద‌న్న చ‌ర్చ‌లు కూడా అప్పుడే మొద‌ల‌య్యాయి. అమ్మవారి గుడికి వచ్చే భక్తుల సంఖ్య మీదే కాదు, వన్ టౌన్ హోల్సేల్ మార్కెట్, బీసెంట్ రోడ్డు, బందరు రోడ్డు, గూడవల్లి నుండి గన్నవరం వరకు ఉన్న రెస్టారెంట్ వ్యాపారాల మీద కూడా తీవ్ర ప్రభావం పడుతుంది. అటు గోదావ‌రి, ఉత్త‌రాంధ్ర జిల్లాల నుంచి వ‌చ్చే వారు ఇక గ‌న్న‌వ‌రం నుంచే కాజ వ‌ర‌కు వెళ్లిపోతారు. వీరికి విజ‌య‌వాడ‌తో ఇక సంబంధం ఉండ‌దు.


విజయవాడ - హైదరాబాద్ మార్గంలో ఉన్న కంచికచర్ల గ్రామానికి ఔటర్ రింగ్ రోడ్డు పడకముందు ప్రతి కారు కూడా పరిటాల గ్రామంలో టీ షాప్ ముందు ఆగి టీ త్రాగి వెళ్ళేవారు. ఔటర్ రింగ్ రోడ్డు పడినాక ఎవరు అటు వైపు వెళ్ళి టీ త్రాగాలనే ఆలోచన పోయింది జనాల్లో అనే చెప్పాలి. ఇప్ప‌టి వ‌ర‌కు ఉత్త‌రాంధ్ర‌, గోదావ‌రి జిల్లాల నుంచి హైద‌రాబాద్ వెళ్లే వారు విజ‌య‌వాడ నుంచే వెళ్లేవారు. అయితే ఇప్పుడు ఖ‌మ్మం మీదుగా గ్రీన్ ఫీల్డ్ హైవే ప‌డ‌డంతో అటు వైపు వెళ్లిపోతారు.

మరింత సమాచారం తెలుసుకోండి: