ఇప్పుడున్న పరిస్థితుల్లో మీరు సిద్దిపేట వెళ్లడం సరికాదని... శాంతి భద్రతలు అదుపు తప్పే అవకాశం ఉంటుందని ఎంపీ సంజయ్కు నచ్చజెప్పే ప్రయత్నం చేశామన్నారు. పోలీస్ కమిషనర్ జోయల్ డేవిస్. అక్కడినుంచి వెళ్లేందుకు మొదట ఆయన నిరాకరించారని ఆయన చెప్పారు. ఆ తర్వాత ఆయనకు ఎస్కార్ట్ ఇచ్చి మరీ గౌరవ ప్రదంగా కరీంనగర్ పంపించామని తెలిపారు. ఈ క్రమంలో ఆయనపై దాడి జరిగినట్లుగా కొంతమంది అనవసరపు ప్రచారం చేస్తున్నారని... అందులో ఎంత మాత్రం నిజం లేదని అన్నారు. అంతేకాకుండా పోలీసులే రఘునందన్ రావు బంధువు ఇంట్లో డబ్బులు పెట్టారన్న ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. ముందస్తు సమాచారంతో.. ఎగ్జిక్యూటివ్ అధికారి అనుమతి తీసుకున్నాకే సోదాలు నిర్వహించామని ఆయన తెలియజేశారు.
రఘునందన్ రావు బంధువు సురభి అంజన్ కుమార్ ఇంట్లోనే డబ్బును స్వాధీనం చేసుకున్నామని తెలిపారు.ఆ సమయంలో వారితో సంతకాలు కూడా తీసుకున్నామన్నారు. అనంతరం పార్టీ కార్యకర్తలు అక్కడికి భారీగా చేరుకోవడంతో వారిని అడ్డుకోలేకపోయామని అన్నారు. ఈ క్రమంలోనే కొంతమంది పోలీస్ అధికారి వద్ద ఉన్న డబ్బును ఎత్తుకెళ్లారని చెప్పారు. అందులో 20 మందిని గుర్తించి కేసులు నమోదు చేశామన్నారు. సోదాల సందర్భంగా ఇంట్లో వాళ్లతో తమ దురుసుగా ప్రవర్తించామన్న ఆరోపణలను ఖండించారు. సోదాల వీడియోలను రిలీజ్ చేశామని... వాటిని గమనిస్తే అసలు నిజాలు తెలుస్తాయని సిద్దిపేట పోలీస్ కమిషనర్ వివరించారు.