ఏడవడం.. ప్రతి ఒక్కరి జీవితంలోనూ ఏది ఉన్నా.. లేకున్నా.. ఏడవడం మాత్రం పక్కాగా ఉంటుంది. మనిషి పుట్టగానే గురువు లేకుండా తల్లి ఒడిలోనే నేర్చుకునే తొలి విద్య ఏడుపే. తల్లి గర్భం నుంచి బయటకు వస్తూనే ఈ కళను ప్రదర్శించకపోతే డాక్టర్లు కూడా ఆందోళన పడతారు. ఆ తరువాత కూడా ఏం కావలసినా ఏడ్చి సాధించుకోవచ్చునని పిల్లలు పదే పదే నిరూపిస్తూనే ఉంటారు. వాస్తవానికి మనకు ఉన్న ఓ వరం ఏంటో తెలుసా..? మన ఫీలింగ్స్. నవ్వు, ఏడుపు, కోపం.. ఇలా ప్రతి సందర్భానికీ ఏదో ఒక ఎమోషన్ బయటకు చూపించగలగడమే నిజమైన జీవితం.
అందులో ముఖ్యంగా ఏడవడం గురించి చెప్పుకుంటే.. ఇది మన జీవితంలో చాలా ముఖ్యమైన భాగంగా మారిపోతుంది. ఇక భావోద్వేగానికి గురై కన్నీళ్లు పెట్టుకోవడం అనేది ఎక్కువ మందికి వచ్చే ఎమోషన్. అయితే ఏడవడం వల్ల కూడా మనకు బోలెడన్ని లాభాలు ఉన్నాయని చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. మరి ఆ లాభాలు ఏంటి..? అన్నది ఇప్పుడు తెలుసుకుందాం. మనసులో ఏదైనా బాధ ఉన్నప్పుడు కరువుతీరా ఏడ్చి సాంత్వన పొందుతుంటాం. అలా ఏడవడం వల్ల శరీరంలోని కలుషిత పదార్థాలు బయటకుపోతాయి.
దాంతోపాటూ ఏడుపు మనిషికి రిలాక్స్నిస్తుంది. మనిషిలోని ఒత్తిడిని తగ్గిస్తుంది. అలాగే ఉద్వేగం వల్ల ఏడుపు వస్తుందన్న విషయం తెలిసిందే. అయితే ఈ ఉద్వేగాన్ని మనసులోనే అట్టిపెట్టేసుకుంటే... దాని వలన కార్టిసాల్, ఎన్కెఫలిన్ వంటి హానికారక రసాయనాలు ఉత్పత్తి అవుతాయి. సుబ్బరంగా ఏడ్చేస్తే ఆ రసాయనాలన్నీ నిమ్మకుండిపోతాయి. అందుకనే ఏడ్చిన తరువాత మనసు మునుపటికంటే చాలా తేలికగా ఉంటుంది. అయితే మీకు ఏదైనా రోజు బాధకలిగినప్పుడు ఏడవడం లేదా నెలకి ఒకటి , రెండు సార్లు కారణం లేకుండా ఏడుపు మంచిది. కానీ, ప్రతిరోజూ లేదా ప్రతి క్షణం ప్రతిదాని గురించి ఏడుస్తున్నట్లు మీకు అనిపిస్తే, ఇది మంచిది కాదు.