కరోనా లాక్డౌన్ నేపథ్యంలో జనాలందరూ ఇండ్లలో ఉండగానే ఎండాకాలం వచ్చేసింది. అయితే గత మూడు రోజుల నుంచి దేశవ్యాప్తంగా ఎండలు అమాంతం పెరిగిపోయాయి. భారీగా పెరిగిన ఎండల వల్ల జంతువులు, పక్షులు మరియు మనుషులు విలవిలలాడిపోతున్నారు. భగ భగ మండే ఎండల కారణంగా ఉదయ 11 గంటలు దాటాక బయటికి రావాలంటేనే జనాలు జంకుతున్నారు. ఇక సాధారణంగా వర్షకాలం, చలికాలంలోనే వ్యాధులు ఎక్కువగా వస్తాయని అనుకుంటారు. కానీ, వేసవిలో కూడా కొన్ని వ్యాధులు ముప్పుతిప్పలు పెడతాయి. ఇంతకీ ఆ వ్యాధులు ఏమిటీ? అవి రాకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.
అందులో ముందుగా.. చర్మ సమస్యలు. వేసవి చాలా మంది ఎదుర్కొనే ప్రధాన సమస్యలో ఇది కూడా ఒకటి. వేసవిలో సూర్యుడి నుంచి విడుదలయ్యే అతినీలలోహిత కిరణాలు వల్ల చర్మంలోని కణాలు దెబ్బతింటాయి. ఎండలో ఎక్కువగా తిరిగితే చర్మం కమిలిపోతుంది. అలాగే చెమట వల్ల కూడా చర్మ సమస్యలు తలెత్తుతాయి. చర్మ సమస్యలు రాకుండా ఉండాలంటే వేసవిలో తప్పకుండా సన్స్క్రీన్ లోషన్లు యూజ్ చేయడం ఉత్తమం. అలాగే వేసవిలో టైపాయిడ్ జ్వరం వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అపరిశుభ్ర ఆహారం, నీరు తీసుకోవడం వల్ల ఈ సమస్య వస్తుంది. అందుకే వీలైనంత వరకు బయటి ఆహారన్ని తినకపోవడమే ఉత్తమం.
ఇంట్లో కూడా పరిశుభ్రత పాటించండి. అదేవిధంగా, వేసవిలో అధిక శాతం మంది ఎదుర్కొనే సమస్య డీ హైడ్రేషన్. డీహైడ్రేషన్కు గురైనవారికి వాంతలు, వికారం, జ్వరం, కడుపునొప్పి వస్తాయి. బయటి ఉష్ణోగ్రతలతోపాటే శరీర ఉష్ణోగ్రత కూడా బాగా పెరిగిపోతుంది. దీంతో చెమట రూపంలో శరీరం తననితాను చల్లబరుచుకొనే ప్రయత్నం చేస్తుంది. ఈ క్రమంలో శరీరంలో ఉన్న నీరంతా బయటకు వస్తుంది. చెమటతోపాటు శరీరంలో ఉండే పొటాషియం, సోడియం, క్లోరైడ్, పాస్పరస్ వంటి లవణాలు కూడా బయటకు పోతాయి. ఇవి తిరిగి శరీరంలోకి చేరాలంటే తప్పకుండా నీళ్లు, కొబ్బరి నీళ్లు, పండ్ల రసాలు తాగాలి. లేదంటే అనేక అనారోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది.