సీనియ‌ర్ స్టార్ హీరోయిన్ రాధ గురించి కొత్త‌గా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. ఈమె అస‌లు పేరు ఉద‌య చంద్రిక వాయ‌ర్‌. కేరళలో జన్మించింది. భారతీరాజా ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన `అళైగళ్ ఓయివత్తిళ్లై` అనే త‌మిళ్ చిత్రంతో సినీ రంగ‌ప్ర‌దేశం చేసిన రాధ‌.. అంచ‌లంచ‌లుగా ఎదుగుతూ 80వ దశకములో స్టార్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగింది. దక్షిణాది భాషలలో దాదాపు స్టార్ హీరోలంద‌రి స‌ర‌స‌నా ఆడి పాడిన రాధ‌.. ఎన్నో అవార్డులు, రివార్డుల‌ను సొంతం చేసుకుంది.

అయితే కెరీర్ పీక్స్‌లో ఉన్న‌ప్పుడే రాధ తన బంధువైన మణి అనే ముంబైకి చెందిన వ్యాపారవేత్తను వివాహం చేసుకుని అక్కడే స్థిరపడింది. పెళ్ళి తర్వాత సినిమాలకు స్వస్తి చెప్పిన రాధ‌.. కార్తీక నాయర్, తులసి నాయర్ మరియు ఒక కుమారుడు విఘ్నేష్ నాయర్‌ల‌కు జ‌న్మ‌నిచ్చింది. వీరిలో కార్తీక‌, తుల‌సిలు సినీ ఇండ‌స్ట్రీలో త‌మ అదృష్టాన్ని ప‌రీక్షించుకున్నారు. కానీ, స‌క్సెస్ అవ్వ‌క‌పోవ‌డంతో.. బిజినెస్‌లు చూసుకుంటున్నారు.
ఇక సెకండ్ ఇన్నింగ్స్ లో చాలామంది హీరోయిన్స్ రీ ఎంట్రీ ఇస్తున్న నేపథ్యంలో రాధ కూడా వస్తే బాగుంటుందని గ‌తంలో ఆమె అభిమానులు కోరుకున్నారు. కానీ, రాధ మాత్రం సినిమాల‌పై మొగ్గు చూప‌లేదు. అయితే ఇప్పుడు డ‌బ్బు కోసం ఈ అల‌నాటి తార బుల్లితెర‌పై సంద‌డి చేసేందుకు సిద్ధ‌మైంది.

జీ తమిళ్ చానల్లో ఈ నెల 16వ తేదీ నుంచి `సూపర్ క్వీన్` అనే డ్యాన్స్ రియాలిటీ షో ప్రారంభం కాబోతోంది. అయితే ఈ షోకు రాధ న్యాయ నిర్ణేతగా వ్య‌వ‌హ‌రించ‌బోతోంది. ఈమె సహ న్యాయనిర్ణేతగా నకుల్ క‌నిపించ‌బోతున్నాడు. ఈ విష‌యాన్ని సోష‌ల్ మీడియా ద్వారా రాధ‌ స్వ‌యంగా తెలియ‌జేసింది. `చాలాకాలం తర్వాత సూప‌ర్ క్వీన్ అనే ఓ రియాల్టీ షో ద్వారా మళ్లీ మీ ముందుకు వ‌స్తున్నా.. ఎంతో సంతోషంగా ఉంది. ఈ షో జీ తమిళ్ లో ప్ర‌సారం కాబోతోంది. ఈ షోలో ప్రతి నిమిషాన్ని ఆస్వాదిస్తాను` అంటూ రాధ పేర్కొంది. అలాగే ఈ డ్యాన్స్ షోకు సంబంధించిన ప్రోమో వీడియోనూ షేర్ చేసింది.



 

మరింత సమాచారం తెలుసుకోండి: