పెళ్ళి చూపులు సినిమాతో పేరు తెచ్చుకున్న నటుడు విజయ్ దేవరకొండ. ఆ తర్వాత అర్జున్ రెడ్డి విజయంతో టాలీవుడ్ లో స్టార్ గా ఎదిగిపోయాడు. గీత గోవిందం సినిమా ఎంతటి విజయాన్ని సాధించిందో తెలిసిందే.ఇలా వరుస విజయాలతో దూసుకెళ్తున్న విజయ్ ప్రస్తుతం భరత్ కమ్మ దర్శకత్వంలో "డియర్ కామ్రేడ్" చిత్రంలో నటిస్తున్నాడు. ఈ సినిమా ఆగస్టులో ప్రేక్షకుల ముందుకు రానుంది.
వరుస సినిమాలతో బిజీగా ఉన్న విజయ్ తన తర్వాతి సినిమాను గీత గోవిందం దర్శకుడు పరశురాంతో చేయబోతున్నాడని టాక్. ప్రేమ కథల్ని తెరకెక్కించడంలో తనదైన స్టైల్ ని చూపించే దర్శకుడు పరశురాం. గీత గోవిందం` సినిమాతో భారీ హిట్ అందించిన దర్శకుడు పరశురాం ఇప్పటివరకు తన తర్వాతి సినిమాను పట్టాలెక్కించలేదు. సూపర్స్టార్ మహేష్ బాబుతో ఓ సినిమా చేయాలనుకున్నాడు.
అందుకోసం కథ కూడా సిద్ధం చేశాడు. గీతా ఆర్ట్స్ బ్యానర్పై అల్లు అరవింద్ ఈ సినిమాను నిర్మిస్తారని అప్పట్లో వార్తలు వచ్చాయి. అయితే మహేష్ బాబు ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉండడంతో పరుశురాం వేచి చూడక తప్పడం లేదు.దీంతో మహేష్ సినిమా కంటే ముందు మరో సినిమా చేయాలని పరశురాం భావిస్తున్నాడట. మరోసారి విజయ్ దేవరకొండతోనే పనిచేయాలని అనుకుంటున్నాడట. విజయ్ కు లైన్ చెప్పి కథ సిద్ధం చేసే పనిలో పరశురాం బిజీగా ఉన్నాడట.
గీత గోవిందం సినిమాలో చాలా చిన్న పాయింట్ తీసుకుని కథనంతో ప్రేక్షకులని మైమరిచేలా చేసిన పరశురాం తన తర్వాతి సినిమా ఎలా ఉంటుందో అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. పరశురాం ఇప్పటి వరకు తీసినవన్నీ ప్రేమ కథలే. తర్వాతి సినిమా కుడా ప్రేమ కథే అయి ఉంటుందని భావిస్తున్నారు. అయిత విజయ్ దేవరకొండ కూడా ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగానే ఉన్నాడు. మరి, పరుశురాం సినిమాను ఎప్పుడు పట్టాలెక్కిస్తాడో చూడాలి.