అమెరికా లో ఉన్నత విద్య చదవాలని చాలా మంది విద్యార్థులు ఆశిస్తుంటారు. ఎంత ఖర్చైనా సరే అగ్రరాజ్యంలో సీటు దక్కించుకునేందుకు ప్రయత్నిస్తారు. అయితే దూరపు కొండలు నునుపు అన్న చందంగా అమెరికా లో మనం బ్రతకడం చాలా గొప్ప. అదృష్టం ఉంటేనే అది సాధ్యం అవుతుంది మనం అందరం భావిస్తుంటాం. ఈ కారణంగానే అవసరం అయితే ఆస్తులు అమ్మి మరీ పిల్లల కోరిక నెరవేర్చేందుకు తల్లిదండ్రులు సిద్ధం అవుతున్నారు.


అయితే అక్కడి పరిస్థితులు రోజురోజుకి దిగజారిపోతున్నాయి. జీవితం మీద ఆశతో పై చదువులు చదువుకొని మంచి ఉద్యోగం సాధించి బాగా సంపాదించి బాగుపడాలి అని అమెరికా వెళ్తున్న భారతీయ విద్యార్థుల జీవితాలు అర్ధాంతరంగా ముగిసిపోతున్నాయి. వారం రోజుల వ్యవధిలో అక్కడ మన దేశానికి చెందిన ముగ్గురు విద్యార్థులు మృతి చెందగా.. నెల రోజుల్లో ఏకంగా ఆరుగురు ప్రాణాలు కోల్పోవడం ఆందోళనకు గురి చేస్తోంది.


వీరిలో ఇద్దరు అనుమానాస్పద స్థితిలో మరణించగా.. హరియాణా విద్యార్థి మాత్రం ఆశ్రయం కల్పించిన వ్యక్తి చేతిలోనే హత్యకు గురయ్యాడు. తెలుగు విద్యార్థులు ఇద్దరు జనవరి 15న ఇంట్లో అనుమానాస్పద స్థితిలో మరణించినా.. గ్యాస్ లీకేజీ వారి మృతికి కారణం అని తేలింది. 2018 నుంచి ఇప్పటి వరకు విదేశాల్లో చదువుకుంటున్న 403 మంది విద్యార్థులు మరణించారు.


అత్యధికంగా కెనడాలో 91మంది మరణించగా.. బ్రిటన్ లో 48 మంది, రష్యాలో 40 మంది, అమెరికాలో 36, ఆస్ర్టేలియాలో 35, ఉక్రెయిన్ లో 21 మంది, జర్మనీలో 20మంది మృతి చెందినట్లు ఇటీవల జరిగిన లోక్ సభలో కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. వీటిలో సహజ మరణాలతో పాటు ప్రమాదాలు, వైద్య సంబంధిత మరణాలు కూడా ఉన్నట్లు వివరించింది. పరాయి దేశంలో ప్రాణాలు కోల్పోతున్న వారిని చూస్తుంటే మనసు బరువెక్కిపోతున్నాయి. ఉన్నత జీవితం అనుభవిస్తారు అని ఆలోచించిన తల్లిదండ్రుల ఆశలు ఆవిరవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

usa