కేవలం ఆరు వేల రూపాయలతో ప్రయోజనం చేకూరదు అంటూ ప్రజల్లో భిన్నాభిప్రాయాలు వెలువడుతున్నాయి. మరోవైపు కేంద్రం ఇటీవల తీసుకువచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలపై రైతుల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమవుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పీఎం-కిసాన్ సాయాన్ని రూ.10 వేలకు పెంచడం ద్వారా రైతుల ఆగ్రహాన్ని కొంత చల్లార్చవచ్చనే అభిప్రాయంలో కేంద్రం ఉన్నట్లు తెలుస్తోంది. కాగా, కరోనా నేర్పిన పాఠంతో ప్రజారోగ్యం విషయంలో ప్రభుత్వ దృక్పథంలో మార్పు వచ్చినట్లు కనిపిస్తోంది. దేశంలో వైద్య సౌకర్యాలు, ఆరోగ్య సేవల కోసం ఇకపై అధిక నిధులు కేటాయించే ఆలోచనలో కేంద్ర ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తుంది.
ఇకపోతే ఈ రంగానికి జీడీపీలో ఒక శాతానికి పైగా మాత్రమే ఖర్చు చేస్తుండగా.. 2025 నాటికి దీనిని 2.5 శాతానికి పెంచడం లక్ష్యంగా పెట్టుకోనుందని అధికారులు వెల్లడించారు. ఈ క్రమంలో రానున్న కేంద్ర బడ్జెట్లో సరికొత్త నిధిని ఏర్పాటు చేయనుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి దీనిని సమకూర్చాలని నిర్ణయించినట్లు సమాచారం. ఇందుకోసం పౌరులు చెల్లించే వ్యక్తిగత ఆదాయపు పన్నుపై, కంపెనీలు చెల్లించే కార్పొరేట్ ట్యాక్స్పై నాలుగు శాతాన్ని హెల్త్, ఎడ్యుకేషన్ సెస్గా వసూలు చేయాలని భావిస్తోంది. పర్యావరణాన్ని కాపాడేందుకుగాను కాలం చెల్లిన వాహనాలకు ఇకపై గ్రీన్ ట్యాక్స్ విధించే ప్రయత్నాల్లో ప్రభుత్వం ఉంది. ఈ ప్రతిపాదనకు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఆమోదం తెలిపారు.