విజయదశమి పర్వదినాలు, నవరాత్రి గడియలు వచ్చినా అక్టోబరులో రాష్ట్ర ప్రభుత్వం పలు సంక్షేమ కార్యక్రమాలకు నిధులు బదిలీ కార్యక్రమాన్ని చేపట్టింది. 7వ తేదీ నుంచి 16వ తేదీ వరకు డ్వాక్రా మహిళలకు రూ.6,500 కోట్లు ఆసరా పథకం కింద నిధులు విడుదల చేయాల్సి ఉంది. ఇవి కాకుండా రైతు భరోసా, జగనన్న తోడు, జగనన్న చేదోడు పథకాలకు మరో రూ.4 వేల కోట్ల రూపాయలు విడుదల చేయాల్సి ఉంది. అంటే మొత్తంగా 11వేల కోట్ల రూపాయలు ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలకు అక్టోబరులో వ్యయం చేయనుంది. ఈ నిధుల కోసం ఉద్యోగుల వేతనాలు, పెన్షన్లు ఇవ్వడంలో జాప్యం జరుగుతోంది. రాష్ట్రంలో దాదాపుగా అక్టోబరులో అన్ని ఖర్చులు కలిపి రూ. 22 వేల కోట్లు అవసరమవుతాయి. కేంద్ర ప్రభుత్వం అదనంగా ఇచ్చిన రూ. 10,500 కోట్లు రుణ పరిమితిలో ఇప్పటికే రూ. 6 వేల కోట్లను రాష్ట్ర ప్రభుత్వం వాడేసింది.
వచ్చే మంగళవారం రిజర్వ్ బ్యాంకు వద్ద మరో రూ. 2 వేల కోట్లకు సెక్యూరిటీ బాండ్లు వేలం వేసి నిధులు సమీకరించాల్సిన పరిస్థితి నెలకొంది. ఆ నిధులు వస్తే ఆసరా ఖర్చులకు పోను, మిగిలిన మొత్తాన్ని మిగిలిపోయిన ఉద్యోగులకు, పెన్షనర్లకు, వేతనాలు, జీతాలు జమ అయ్యే అవకాశం ఉంది. రోజు వారీ వచ్చే ఆదాయాన్ని కూడా ఆసరాకు మళ్లించడంతో ప్రభుత్వంలో ఆర్ధికంగా చిల్లిగవ్వకూడా దొరకని పరిస్థితి నెలకొంది. వీటితో పాటు కాంట్రాక్టర్ల బిల్లులు, అభివృద్ది కార్యక్రమాలకు నిధులు, ఇతర దైనందిన ప్రభుత్వ రోజు వారీ ఖర్చులకు కూడా నిధులు లేక ఆయా శాఖల అధికారులు అల్లాడుతున్నారు.