దేశంలో దొంగనోట్లు ఎక్కువగా ఉన్న రాష్ట్రం ఏదో తెలుసా ? ఇంకేది గుజరాత్ రాష్ట్రమేనట. దొంగనోట్లను నియంత్రించటం, ఉగ్రవాదాన్ని అరికట్టటం అనే రెండు కారణాలతో నరేంద్రమోడి అప్పట్లో పెద్ద నోట్లైన రూ. 1000, రూ. 500 నోట్లను రద్దు చేసిన విషయం తెలిసిందే. పెద్ద నోట్ల వల్ల దొంగనోట్లు, బ్లాక్ మనీ ఎక్కువైపోతోందని చెప్పిన మోడి తుగ్లక్ చర్యగా తర్వాత రూ. 2000, రూ. 500 నోట్లను చెలామణిలోకి తెచ్చారు.
ఇప్పుడు విషయం ఏమిటంటే రూ. 2000 నోట్లు అధికారికంగా చెలామణిలోకి రాకముందే దానికి నకిలీ నోట్లు మార్కెట్లోకి వచ్చేశాయి. అంటే పెద్ద నోట్ల రుద్దు విషయంలో నరేంద్రమోడి చెప్పిందంతా ఉత్త సొల్లే అని అందరికీ అర్ధమైపోయింది. తాజాగా బయటపడిన విషయం ఏమిటంటే కొత్తగా మార్కెట్లోకి తెచ్చిన 2 వేల రూపాయల నోట్లలో నకిలీ నోట్లు తయారు చేయటానికి కావాల్సినన్ని సాంకేతిక లోపాలున్నాయని బయటపడింది.
దేశవ్యాప్తంగా చెలామణిలో ఉన్న రూ. 2000 నోట్లలో సగానికి పైగా ఫేక్ నోట్లేనట. ఈ విషయాన్ని స్వయంగా నేషనల్ క్రైం రికార్డ్స్ బ్యూరో (ఎన్సిఆర్బి) బయటపెట్టింది. ఎన్సిఆర్బి బయటపెట్టిన డేటా ప్రకారం ప్రస్తుతం చెలామణిలో ఉన్న రూ. 2 వేల నోట్లలో 56 శాతం నకిలీ నోట్లేనట. అంటే మీ దగ్గరున్న నోట్లలో కూడా నకిలీవి ఉండే అవకాశం ఉందని తేలిపోయింది.
ఇంతకన్నా విచిత్రమైన విషయం ఏమిటంటే దేశంమొత్తం మీద చెలామణి అవుతున్న దొంగనోట్లకు గుజరాత్ రాష్ట్రమే ప్రధాన కేంద్రంగా మారిపోయిందట. గుజరాత్ రాష్ట్రంలో చెలామణి అవుతున్న రూ. 2 వేల నోట్లలో అసలువేవో దొంగ నోట్లేవో తెలుసుకోవటానికి జనాలు నానా అవస్తలు పడుతున్నారట. వ్యాపారులు, పారిశ్రామికవేత్తలు, ఉద్యోగులు, బడుగు జీవుల దగ్గరున్న నోట్లలో దొంగ నోట్లు బయటపడుండటంతో ఆ రాష్ట్రం గందరగోళంగా తయారైంది. ఈ తలనొప్పులు భరించలేక చాలామంది అసలు 2 వేల రూపాయల నోట్లే వద్దంటు దణ్ణం పెడుతున్నారట. ఇది ప్రధానమంత్రి నరేంద్రమోడి సొంత రాష్ట్రం గుజరాత్ పరిస్ధితి.