విశాఖ జిల్లా అయితే టీడీపీకి కంచుకోట. అంతే కాదు. నర్శీపట్నం మునిసిపాలిటీ పేరు చెప్పగానే అయ్యన్నపాత్రుడి కుటుంబమే గుర్తుకువస్తుంది. అతి చిన్న పంచాయతీగా ఉన్నప్పటి నుంచి ఆ కుటుంబమే వరసగా పలుమార్లు పాలన సాగించింది. ఆ తరువాత మేజర్ పంచాయతీగా మారినా 2013లో మునిసిపాలిటీగా అవతరించినా కూడా నర్శీపట్నం అయ్యన్న కుటుంబం చేతుల నుంచి బయటకు పోలేదు. అలాంటి నర్శీపట్నం మునిసిపాలిటీని ఇపుడు వైసీపీ తన ఖాతాలో వేసుకోవడానికి విశ్వ ప్రయత్నం చేస్తోంది. అయ్యన్న ఫ్యామిలీ అంటే నర్శీపట్నం మునిసిపాలిటీ అన్నట్లుగా ఉన్న సీన్ ని మార్చేయాలనుకుంటోంది. గత ఎన్నికల వేళ అయ్యన్నపాత్రుడి తమ్ముడు, నర్శీపట్నం మునిసిపాలిటీ మాజీ వైఎస్ చైర్మన్ సన్యాసిపాత్రుడు వైసీపీలో చేరిపోవడంతో అక్కడ నాలుగు వేల మెజారిటీ వైసీపీకి వచ్చింది.
దాంతో ఇపుడు మళ్ళీ ఆయన్ని వైసీపీ వ్యూహాత్మకంగా బరిలోకి దింపింది. అయ్యన్న కుటుంబంలో సన్యాసిపాత్రుడి స్టైల్ వేరు. ఆయన రాజకీయమంతా మునిసిపాలిటీతోనే ముడిపడి ఉంది. ఆయనకు గట్టి పట్టు కూడా ఉంది. ఇపుడు ఆయన తన సత్తా చాటనున్నారు. మునిసిపల్ పోరు క్లైమాక్స్ కి చేరిన వేళ బరిలోకి దిగిన అయ్యన్న తమ్ముడు సీన్ మొత్తం మార్చేయడానికి రెడీ అయిపోయారు. ఈ పరిణామంతో మాజీ మంత్రికి గట్టి షాక్ తప్పదా అన్న చర్చ సాగుతోంది. మొత్తానికి నర్శీపట్నం మునిసిపాలిటీని కనుక అయ్యన్న కుటుంబం చేతుల నుంచి తీసుకుంటే వైసీపీకి సంపూర్ణ విజయం దక్కినట్లే అంటున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో. ఎవరు జెండా ఎగరేస్తారో.