రాజకీయాల్లో ఎప్పటికప్పుడు యాక్టివిటీ ఉండటం చాలా ముఖ్యం. ఒక వ్యక్తికైనా, ఒక వ్యవస్థకైనా పనిలో చురుకుదనం లేకుంటే అవుట్ డేటెడ్ అయిపోతాం. ఇదే అంశాన్ని గుర్తించినట్లుగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన రాజకీయ వ్యూహాన్ని పూర్తిగా మార్చుకున్నారు. ఇంతకుముందు వారానికి ఒకసారి మాత్రమే ప్రజల మధ్యకు వచ్చేవారు. అయితే ఇప్పుడు ప్రతి రెండు రోజులకు ఒకసారి ప్రజలతో కలిసేలా ప్రణాళిక వేసుకున్నారు. వారానికి కనీసం మూడు సార్లు ప్రజల ముందుకు వెళ్లి ఏదో ఒక కార్యక్రమం ద్వారా వారితో మమేకం అవుతున్నారు.


ఈ కొత్త వ్యూహంతో చంద్రబాబు “ప్రజలతో అందుబాటులో ఉండే ముఖ్యమంత్రి” అనే ఇమేజ్ తెచ్చుకోవాలని ప్రయత్నిస్తున్నారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు మొదలైన వాటిని నేరుగా వారికి వివరించడం ద్వారా ఆయనకు మరింత పాజిటివ్ ఇమేజ్ వస్తుందని భావిస్తున్నారు. ప్ర‌తిప‌క్ష‌
వైసీపీ పరిస్థితి మాత్రం పూర్తిగా విరుద్ధంగా ఉందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ముఖ్యనేత జగన్ మోహన్ రెడ్డి ప్రజల మధ్యకి రాకపోవడం, పార్టీ కార్యక్రమాలు కూడా ఊపందుకోవడం లేదు. తాడేపల్లిలో కూర్చొని అధికార ప్రకటనలు చేయడం, లేదా సోషల్ మీడియాలో సుదీర్ఘ పోస్టులు పెట్టడం వరకు మాత్రమే ఆయన  పరిమితమైపోయార‌ని పార్టీ లోపలే అసంతృప్తి వ్యక్తమవుతోంది.


ఎన్నికల ఫలితాలు వచ్చి ఏడాదిన్నర అవుతున్నా వైసీపీ తరపున ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై ఆక‌ట్టుకునే పోరాటాలు చేయ‌డం లేదు. రాజకీయంగా కూడా పార్టీ దూకుడుతో వెళ్ల‌క‌పోవ‌డంతో ప్రజల్లో వైసీపీ పట్ల ఆసక్తి తగ్గుతోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఒకవైపు కూటమి ప్రభుత్వం బలమైన స్వరంతో ప్రతి విషయానికి వెంటనే స్పందిస్తుంటే, మరోవైపు వైసీపీ నాయకులు మాత్రం చాలా సందర్భాల్లో మౌనంగా ఉండిపోతున్నారు. దీంతో పోలిస్తే వైసీపీ ప్రభావం మరింత తగ్గిపోతున్నట్లు కనిపిస్తోంది. ఇప్పటికైనా జగన్ తన వ్యూహంలో మార్పు చేసుకోవాలని, నిరంతరం ప్రజల మధ్య ఉండాలని, ముఖ్యంగా ప్రత్యక్షంగా వారిని కలిసేలా ప్లాన్ చేసుకోవాలని వైసీపీ కార్యకర్తలు, నేతలు కోరుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: