దాహమేసినప్పుడు బావి తవ్వుకునే తెలివి కాంగ్రెస్ పార్టీకే ఎక్కువ అని రాజకీయ వర్గాలు చమత్కరిస్తున్నాయి. తాజాగా మాజీ క్రికెటర్, సీనియర్ నేత మొహమ్మద్ అజహరుద్దీన్‌కు మంత్రి పదవి ఇవ్వాలని తీసుకున్న నిర్ణయం అదే విషయాన్ని మరోసారి నిరూపించింది. తెలంగాణలో జూబ్లిహిల్స్ ఉపఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో మైనార్టీ వర్గం ఓట్లు కీలకం అని భావించిన కాంగ్రెస్ పార్టీ, చివరి నిమిషంలో అజహరుద్దీన్ కార్డ్ ఆడింది. రాష్ట్ర మంత్రివర్గం ఏర్పాటు సమయంలో మైనార్టీలకు ప్రాతినిధ్యం ఇవ్వకపోవడం కాంగ్రెస్‌కు పెద్ద మైనస్‌గా మారింది. ముస్లిం వర్గం నుంచి ఎవరూ గెలవకపోయినా, ఎంఎల్సీ మార్గంలో అవకాశం కల్పించవచ్చు... పార్టీ దానిని పట్టించుకోలేదు. సీనియర్ నేత షబ్బీర్ అలీ నుంచి యువనాయకుడు నాంపల్లి ఫిరోజ్ ఖాన్ వరకూ అనేక మంది అందుబాటులో ఉన్నా, కాంగ్రెస్ ఎవరినీ పరిగణలోకి తీసుకోలేదు.


రెండో సారి క్యాబినెట్ విస్తరణ సమయంలో కూడా మైనార్టీలకు ప్రాధాన్యత ఇవ్వకపోవడం అసంతృప్తి పెంచింది.
ఇప్పుడు జూబ్లిహిల్స్ ఉపఎన్నికల వేళ మైనార్టీల ఓట్లు కీలకమని గ్రహించిన కాంగ్రెస్, రాత్రికి రాత్రే అజహరుద్దీన్‌కు మంత్రి పదవి ఇవ్వాలని నిర్ణయించింది. గవర్నర్ అనుమతితో శుక్రవారం ఆయన ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. కానీ ఈ నిర్ణయం ముస్లిం వర్గం మనసు గెలుచుకుంటుందా అన్నది సందేహంగా మారింది. ఎందుకంటే ఇది మైనార్టీ ప్రాధాన్యతను గుర్తించి ఇచ్చిన పదవి కాదు, అవసరం వచ్చినప్పుడు ఇచ్చిన రాజకీయ ఆఫర్ మాత్రమే అన్న విమ‌ర్శ‌లు వినిపిస్తున్నాయి.


ఓట్లు కావాలనే ఉద్దేశంతో ఇచ్చిన ఇలాంటి పదవులు, మైనార్టీలలో నిజమైన విశ్వాసాన్ని కలిగించవు అని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఓటర్లు తమ ప్రయోజనాలను గుర్తించి ఓటు వేస్తారు కానీ అవసరానికి ఇచ్చే పదవుల వలన పార్టీకి లాభం చేకూరదని వారి అభిప్రాయం. అదే సమయంలో కాంగ్రెస్ హైకమాండ్ వ్యవహారశైలి కూడా విమర్శలకు గురవుతోంది. రాష్ట్రాల్లో క్షేత్రస్థాయి రాజకీయ పరిస్థితులను పట్టించుకోకుండా, ఢిల్లీలోనే నిర్ణయాలు తీసుకోవడం వల్ల స్థానిక నేతల అసంతృప్తి పెరుగుతోంది. అవసరానికి రాత్రికి రాత్రే తీసుకునే నిర్ణయాలు పార్టీకి మైనార్టీ వర్గంలో నమ్మకం పెంచడంలో కాకుండా, దెబ్బతీసే ప్రమాదం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. మొత్తం మీద, దాహమేసినప్పుడు బావి తవ్వుకునే కాంగ్రెస్ రాజకీయాలు ఈసారి జూబ్లిహిల్స్‌లో ఎంత వరకు ఫలిస్తాయో ఎన్నికల ఫలితాలే చెబుతాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: