ఆరోగ్య సేతు యాప్.. ప్రత్యేకంగా పరిచయం అవసరంలేని యాప్. కరోనా వైరస్ రోజురోజుకు విజృంభిస్తున్న వేళ.. కేంద్రం ఇటీవల విడుదల చేసిన ఈ కరోనా ట్రాకింగ్ యాప్ ప్రస్తుతం ఓ రేంజ్లో దూసుకుపోతోంది. లాక్డౌన్ కారణంగా ఎక్కడివారక్కడే ఏకాంత జీవితం గడుపుతున్న నేపథ్యంలో... ప్రజలతో అనుసంధానం కావడంతో పాటు కరోనా సోకిన వ్యక్తులను ట్రాక్ చేసి అప్రమత్తమయ్యేలా కేంద్రం దీన్ని రూపొందించింది. పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యంతో ఈ యాప్ను ప్రభుత్వం రూపొందించింది. ఇది ఎప్పటికప్పుడు ఆరోగ్యపరిస్థితిని వివరిస్తుంది. దీని ద్వారా వైరస్ సోకిందా లేదా అనేది కూడా తెలుసుకోవచ్చు.
ఒక్కసారి ఈ యాప్ను స్మార్ట్ ఫోన్లో ఇన్స్టాల్ చేసుకుంటే.. దగ్గరలో ఉన్న ఆరోగ్య సేతు ఇన్స్స్టాల్ చేసి ఉన్న స్మార్ట్ ఫోన్లను డిటెక్ట్ చేస్తుంది. ఇక ఎవరైనా కరోనా పాజిటివ్ ఉన్న వ్యక్తి మరొకరితో కాంటాక్ట్లోకి వస్తే వెంటనే అలర్ట్ పంపిస్తుంది. ఇక ఇప్పటికే ఈ యాప్ను కోట్లాది మంది డౌన్లోడ్ చేసుకున్నారు. అయితే ఇకపై కొత్త స్మార్ట్ఫోన్లో ఆరోగ్య సేతు యాప్ ప్రీ-ఇన్స్టాల్డ్గా రానుందని విశ్వసనీయ వార్గాల సమాచారం. అంటే కొత్త స్మార్ట్ఫోన్లో గూగుల్ మ్యాప్స్, ప్లే స్టోర్ లాంటి యాప్స్ ముందే ఉన్నట్టే ఇకపై ఆరోగ్య సేతు యాప్ కూడా ఉండనుందన్నమాట.
లాక్డౌన్ ఎత్తేసిన తర్వాత భారతదేశంలో అమ్మే అన్ని స్మార్ట్ఫోన్లలో ఆరోగ్య సేతు యాప్ ప్రీ-ఇన్స్టాల్డ్గా రానుంది. కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని అమలు చేసేందుకు నోడల్ ఏజెన్సీని నియమించనుందని తెలుస్తోంది. ఆ ఏజెన్సీ స్మార్ట్ఫోన్ కంపెనీలను సంప్రదించి కొత్త మొబైల్స్లో ఆరోగ్య సేతు యాప్ ఉండేలా చర్యలు తీసుకోనుందట. అంతేకాకుండా.. ఆరోగ్య సేతు యాప్లో రిజిస్టర్ అయిన తర్వాతే కొత్త స్మార్ట్ఫోన్ ఆన్ అయ్యేలా సెట్టింగ్స్ ఉంటాయని తెలుస్తోంది. అలాగే స్మార్ట్ఫోన్ మాత్రమే కాదు ఫీచర్ ఫోన్లో కూడా కాంటాక్ట్ ట్రేసింగ్ సాధ్యమయ్యేలా ఆరోగ్య సేతు యాప్ను ఇన్స్టాల్ చేయాలని కేంద్రం భావిస్తుట్టు తెలుస్తోంది.