భారతీయులకు శుభవార్త.. దేశవ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తి రేట్ తగ్గుముఖం పడుతోంది. కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించిన గణాంకాలు ఇదే విషయాన్ని చెబుతున్నాయి. ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఇప్పటివరకు కరోనా వైరస్ పెరుగుదల రేట్ 40శాతానికి పడిపోయినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఇప్పటివరవకు కరోనా వైరస్ వ్యాప్తి రేట్ 1.2గా నమోదు అవుతోంది. అదే గత నెల మార్చి 15వ తేదీ నుంచి మార్చి 31 మధ్య కొవిడ్-19 పెరుగుదల రేట్ 2.1గా నమోదు అయింది. మార్చి నెలతో పోల్చితే.. ఏప్రిల్లో మహమ్మారి పెరుగుదల రేట్ దాదాపుగా 40శాతానికిపైగా పడిపోయిందని కేంద్ర ఆరోగ్యశాఖ చెబుతుతోంది. అంతేగాకుండా.. దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ బారి నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య కూడా క్రమంగా పెరగుతోంది. ఇది చాలా మంచి పరిణామమని అధికారవర్గాలు చెబుతున్నాయి.
కరోనా వైరస్ వ్యాప్తి నిరోధానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలు మంచి ఫలితాన్ని ఇస్తున్నాయని చెప్పొచ్చు. ప్రధానంగా లాక్డౌన్ కొనసాగింపు, సామాజిక దూరం పాటించేలా ప్రజల్లో చైతన్యం తీసుకురావడం, వైరస్ ప్రభావం ఆధారంగా ప్రాంతాలను కంటైన్మెంట్ జోన్లుగా విభజించి, కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవడం వల్ల ఈఫలితాలు వస్తున్నాయని అధికారవర్గాలు చెబుతున్నాయి. నిజానికి.. దేశంలో సుమారు 25జిల్లాల్లో గత 15 రోజులుగా ఒక్క కరోనా పాజిటివ్ కేసు కూడా నమోదు కాకపోవడం వైరస్ తగ్గుముఖం పడుతుందనడానికి నిదర్శనమని అంటున్నాయి. ఏదిఏమైనా.. కరోనా మహమ్మారిని తరిమికొట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయన్నమాట.