పిల్లలకు ఏది పెట్టిన గాని అలోచించి పెట్టాలి.. బయట దొరికే ఆహార పదార్ధాలు అసలు పెట్టకూడదు.చాలామంది పిల్లలు ఇప్పటికే బయట దొరికే ఫాస్ట్ ఫుడ్ కి అలవాటు పడి పోయి ఇంట్లో వండే వంటలు తినడం మానేశారు.ఫాస్ట్ ఫుడ్ తినడానికి రుచికరంగా ఉంటుంది కానీ వాటిలో చాలా రకాల కొవ్వుపదార్ధాలు, నూనెలు, ఫుడ్ కలర్స్, మాసాల ఎక్కువగా వాడడం వల్ల అవి రుచుకి బాగుంటాయి కానీ ఆరోగ్యానికి మాత్రం మంచివి కావు.అలాగే చాలామంది పిల్లలు  బయట దొరికే చిప్స్ లాంటివి ఎక్కువగా ఇష్టపడతారు  కానీ వాటిలో కూడా  పోషకాలు ఉండవు.


అందుకనే పిల్లలకు  రుచితో పాటుగా మేలైన పోషకాలను అందించే రాగి లడ్డు పెట్టడం చాలా మంచిది.ఈ రాగి లడ్డులోఎదిగే పిల్లలకు కావలసిన శక్తిని అందించగల పోషకాలు ఉన్నాయి. రాగుల్లో ఎన్నో పోషక విలువలున్నాయి.ఇతర గింజల్లో వేటిలో లేనంత క్యాల్షియం నిల్వలు రాగుల్లో వుంటాయి.ఈ కాల్షియం వల్ల పిల్లల్లో ఎముకల బలహీనత అనేది రాదు. ఎముకల బలహీనతను అరికట్టడంలో రాగులు ప్రధాన పాత్ర పోషిస్తాయి. ఎముకల పుష్టి కోసం కొందరు పిల్లలకు క్యాల్షియం మాత్రలను వాడుతుంటారు. వాటికి బదులు రోజూ రాగి లడ్డు తీసుకుంటే ఎంతో మేలు కలుగుతుంది. పిల్లలు పుష్టిగా, వారి ఎముకలు బలంగా వుండాలంటే రాగి లడ్డు ఇస్తుండాలి. అందుకనే తక్కువ సమయంలో, సులభంగా చేసే ఈ రాగిలడ్డూను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం

కావలిసిన పదార్ధాలు :

రాగిపిండి- 1 కప్పు
తురిమిన బెల్లం – 1 కప్పు
నువ్వులు-1 కప్పు
వేయించిన పల్లీలు- 1 కప్పు
నెయ్యి- 1 కప్పు
జీడిపప్పు- 10
బాదం పప్పు- 1/4 కప్పు
యాలకుల పొడి- 1/4 స్పూన్
ఎండు ద్రాక్ష- 10


ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి పల్లీలు, నువ్వులు, బాదం పప్పు, జీడిపప్పు, రాగి పిండి అన్నింటినీ విడివిడిగా వేయించి పక్కన పెట్టుకోవాలి. ఆరిన తర్వాత పల్లీలు, నువ్వులు, బాదం పప్పు, జీడిపప్పు కలిపి మిక్సీ పట్టుకోవాలి. తర్వాత ఈ మిశ్రమానికి వేయించి పెట్టుకున్న రాగిపిండి, బెల్లం తురుము, యాలకుల పొడి వేసి కలిపి అందులో మరికొన్ని జీడిపప్పు పలుకులు, ఎండుద్రాక్ష వేసి కొద్దికొద్దిగా వేడి చేసుకున్న నెయ్యి కలుపుకొని లడ్డులా చేసుకోవాలి. అంతే పిల్లలు ఎంతో ఇష్టంగా తినే రాగి లడ్డు రెడీ.

మరింత సమాచారం తెలుసుకోండి: