సినిమా పరిశ్రమకు డబ్బులు తెచ్చిపట్టే పండుగలు రెండు ఉంటాయి. అందులో ఒకటి దసరా.. రెండోది సంక్రాంతి.. ఈ దసరాకు సైరా ఒక్కటే రిలీజ్ అవుతున్నది. అది దసరాకు కొన్ని రోజుల ముందుగానే అంటే మహాత్మాగాంధీ జయంతి రోజున రిలీజ్ చేస్తున్నారు. దసరాకు కొన్ని సినిమాలు రిలీజ్ అవుతున్నా వాటికి పెద్దగా ప్రాధాన్యత లేదు. చిన్న సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. అయితే, సంక్రాంతి బరిలో మాత్రం చాలా సినిమాలు ఉన్నాయి.
అందులో మొదటిగా రాబోతున్న సినిమా దర్బార్. రజినీకాంత్ నటిస్తున్న ఈ సినిమాను సంక్రాంతికి రిలీజ్ చేస్తున్నట్టు అందరికంటే ముందుగా ప్రకటించారు. మురుగదాస్ దర్శకత్వం వహిస్తున్నారు కాబట్టి సినిమాపై క్రేజ్ ఉన్నది. పైగా 25 ఏళ్ల తరువాత రజినీకాంత్ పోలీస్ గా కనిపిస్తున్నారు. ఈ సినిమాతో పాటు టాలీవుడ్ లో మహేష్ సరిలేరు నీకెవ్వరూ సినిమా కూడా రిలీజ్ కాబోతున్నది.
పక్కా ఎంటర్టైనర్ గా సినిమాను తెరకెక్కిస్తున్నారు. అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ షూటింగ్ వేగంగా జరుగుతున్నది. ప్రస్తుతం హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన భారీ సెట్స్ లో సినిమా షూటింగ్ జరుగుతున్నది. రష్మిక మొదటిసారి మహేష్ కలిసి నటిస్తుంటే .. 13 ఏళ్ల తరువాత విజయశాంతి తిరిగి సినిమాల్లో నటిస్తోంది. ఈ మూవీకి సంబంధించిన ఫస్ట్ లుక్ రిలీజ్ తరువాత అంచనాలు పెరిగాయి.
దీంతో పాటు అల్లు అర్జున్ అల వైకుంఠపురంలో కూడా రిలీజ్ కాబోతున్నది. ఇది కూడా భారీ బడ్జెట్ సినిమానే. త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తున్నారు. పూజా హెగ్డే హీరోయిన్. ఫాదర్ సెంటిమెంట్ స్టోరీగా సినిమా తెరకెక్కుతోంది. ఇందులో టబు కీలక పాత్ర పోషిస్తోంది. ఈ సినిమా కూడా సంక్రాంతికే వస్తున్నట్టు ఇప్పటికే ప్రకటించారు. పోస్ట్ ఫోన్ చేసుకునే అవకాశం లేదు. సంక్రాంతికి వచ్చి హిట్ కొట్టాలని చూస్తున్నది. మహేష్ సినిమా ఉన్నప్పటికీ పోటీకి సిద్ధం అంటోంది ఈ సినిమా.
దీంతో పాటుగా బాలయ్య కొత్త సినిమా కూడా సంక్రాంతికి రెడీ అవుతున్నది. బాలయ్య కొత్త లుక్ రిలీజ్ తరువాత సినిమాపై అంచనాలు పెరిగాయి. సోషల్ మీడియాలో బాలయ్య లుక్ వైరల్ అయిన సంగతి తెలిసిందే. కెఎస్ రవికుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇలా నాలుగు సినిమాలు సంక్రాంతికి వస్తుండటంతో నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లకు ఏం చేయాలో అర్ధంకాని పరిస్థితుల్లో పడిపోయారు.