ఓ పేద గిరిజన విద్యార్థిని డాక్టర్ కావలునుకే కలను నిజం చేసేందుకు తెలంగాణ మంత్రి కెటిఆర్ ఆర్థిక సాయం చేశారు. దాంతో కెటిఆర్ చేసిన సాయానికి నెట్టింట ప్రశంసలు కురుస్తున్నాయి. వివరాల్లోకి వెళితే...హైదరాబాద్ నగరం బోరబండ ప్రాంతానికి చెందిన అనూష అనే గిరిజన విద్యార్థిని కిర్గిజిస్తాన్ హెల్త్ యూనివర్సిటీలో ఎంబీబీఎస్ చదువుకుంటోంది. అయితే కరోనా పరిస్థితుల నేపథ్యంలో విద్యార్థిని అనూష భారతదేశానికి తిరిగి వచ్చింది. కాగా ప్రస్తుతం తాను చదువుతున్న వైద్య విద్య కోర్సులో అనూష మొదటి మూడు సంవత్సరాల్లో 95 శాతం మార్కులతో ఉత్తమ ప్రతిభ కనబరిచింది. కానీ కరోనా నేపథ్యంలో చదువును కొనసాగించే పరిస్థితులు లేకపోవడంతో తన తల్లితో కలిసి అనూష కూడా కూరగాయలు అమ్మడం ప్రారంభించింది.

చదువుల తల్లి అనూష తండ్రి వాచ్ మెన్  గా పని చేస్తున్నారు. కాగా అనూష వైద్య విద్య కోర్సు ఫీజుల కోసం ఆ పేద కుటుంబం ఎన్నో ఇబ్బందులు పడుతున్న విషయం మంత్రి కేటీఆర్ దృష్టికి వచ్చింది. తన పేదరిక పరిస్థితుల నేపథ్యంలోనూ ఎంతో ఛాలెంజింగ్ గా, వైద్య విద్యపై మక్కువతో విదేశాలకు వెళ్లి చదువుకునే ప్రయత్నం చేస్తున్న అనూష కు మంత్రి కేటీఆర్ అండగా నిలవాలని...ఆమె చదువును కొనసాగించేందుకు సాయం చేయాలని నిర్ణయం తీసుకున్నారు.

దాంతో కేటీఆర్ ఈరోజు అనూష వైద్య విద్యను కొనసాగించేందుకు అవసరమైన ఆర్థిక సహాయం అందచేశారు. అనూష ఎంబీబీఎస్ కు సంబంధించిన ఫీజుల బాధ్యతను తానే తీసుకుంటానని కెటిఆర్ హామీ ఇచ్చారు. అంతే కాకుండా కోర్సు పూర్తి చేసుకొని డాక్టర్ గా తిరిగి రావాలని కేటీఆర్ అనూష ను ఆశీర్వదించారు. ఈ సందర్భంగా అనూష కు కెటిఆర్ ఆల్ ద బెస్ట్ చెప్పి... అన్నివిధాలుగా అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. వైద్య విద్యకు అండగా నిలిచిన మంత్రి కేటీఆర్ కు అనూష కుటుంబం కృతజ్ఞతలు తెలిపింది.

మరింత సమాచారం తెలుసుకోండి: