తెలుగు రియాల్టీ షో బిగ్బాస్-3కి హోస్ట్గా వ్యవహరించనున్న సినీ నటుడు అక్కినేని నాగార్జున కు ఓయూ స్టూడెంట్స్ నుండి షాక్ ఎదురైంది. ఓయూ జేఏసీ నాయకుడు కందుల మధు ఆధ్వర్యంలో బిగ్బాస్కు వ్యతిరేకంగా ఓయూ విద్యార్థులు ఆందోళన చేపట్టారు. ఈ రోజు ఉదయం ఆయన ఇంటి ముందు ఓయూ విద్యార్థులు నినాదాలు చేశారు. బిగ్బాస్ షోను వెంటనే నిలిపి వేయాలంటూ, నాగార్జున డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేస్తూ నిరసనకు దిగారు. షో నిర్వాహకులు తమతో అభ్యంతరకరంగా ప్రవర్తించి.. లైంగికంగా వేధించారని జర్నలిస్ట్ శ్వేతారెడ్డి, నటి గాయత్రి గుప్తా గత కొన్ని రోజులుగా షాకింగ్ ఆరోపణలు చేస్తున్న సంగతి పాఠకులకు తెలిసిందే.
ఈ నేపథ్యంలో బిగ్బాస్ షో మహిళలను కించపరిచే విధంగా ఉందని,ఆ షోను రద్దు చేయకపోతే నాగార్జున ఇంటిని ముట్టడిస్తామని ఓయూ ఐక్య విద్యార్థి సంఘాలు ఇదివరకే హెచ్చరించిన సంగతి తెలిసిందే. జేఏసీ నాయకులు డాక్టర్ కందుల మధు, వేల్పులకొండ వెంకట్ ఫిర్యాదులో పేర్కొన్న వివరాలు ఇలా ఉన్నాయి.
1, మా టీవీలో ప్రసారమవుతున్న రియాల్టీ షో 'బిగ్బాస్' కోసం నటీనటుల ఎంపికకు స్క్రీనింగ్ టెస్టులు చేస్తున్నారని, ఆ టెస్టులకు మహిళలను ఆహ్వానించి లైంగికంగా వేధిస్తున్నారనేది వీరి ఆరోపణ.
2, బాధితుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోందని, వేధింపులపై పత్రికల్లో పలు కథనాలు వస్తున్నాయి.
3, సభ్యులను మూడు నెలలు నిర్బంధంలో ఉంచి రహస్యంగా చిత్రీకరించడం, వారితో ముందుగానే బాండ్పేపర్పై అగ్రిమెంట్ రాసుకోవడం, తెల్ల కాగితాలపై సంతకాలు తీసుకొని ఆడవాళ్లను లైంగికంగా హింసిస్తున్నారని వీరు ఆరోపిస్తున్నారు.
4, బిగ్బాస్ షోను నిలిపివేసేలా కమిషన్ ఆదేశాలు ఇవ్వాలని, నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని నాంపల్లిలోని రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ (హెచ్చార్సీ)లో ఓయూ విద్యార్థి నాయకులు ఫిర్యాదు చేశారు.
హీరో అక్కినేని నాగార్జున ఇంటి ముందు స్టూడెంట్స్ ఆందోళన చేస్తున్న విషయం తెలుసుకొని, అక్కడికి చేరుకున్న పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు.