భారత్ లో కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తుండటంతో జాతీయ విపత్తుగా ప్రభుత్వం ప్రకటించింది. అయితే కోవిడ్ - 19 భారత్ లో ఉదృతం కావటంతో ఆందోళనకర పరిస్థితి వ్యక్తం అవుతోంది. తాజాగా మన దేశంలో ఆదివారం కరోనా వైరస్ భాదిత కేసుల సంఖ్య 105కు పెరిగింది. ఇప్పుడు నమోదు అయిన కేసులలో కేవలం మహారాష్ట్రలోనే శనివారం ఐదు కరోనా కేసులు బయటపడ్డాయి.
ఇప్పటికి నమోదు అయిన కేసులతో మొత్తం ఆ రాష్ట్రంలో వైరస్ బారిన పడిన వారి సంఖ్య 31కి చేరింది. నమోదు అయిన కేసులు పుణే, ముంబై, నాగపూర్, యావత్మాల్ ప్రాంతానికి చెందిన వారిగా గుర్తించారు. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 100 దాటింది. కానీ.. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ నమోదయిన కేసుల సంఖ్యను అధికారికంగా ప్రకటించలేదు.
కాగా., ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటి వరకు వైరస్ బారిన పడిన వారి సంఖ్య 1,56,000 లకు చేరుకుంది. అలానే ఈ మహమ్మారి బారిన పడి చనిపోయిన వారి సంఖ్య 5,835 కు చేరింది. దీంతో ప్రపంచ వ్యాప్తంగా దేశాలు కరోనాతో వణికి పోతున్నాయి. ఇక జైపూర్ లో 24 ఏళ్ల యువకుడికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. ఇంకా రాజస్ధాన్ లో వైరస్ బారిన పడిన వారి కేసుల సంఖ్య నాలుగుకి పెరిగింది.
అయితే.. ఈ వ్యక్తి ఇటీవల స్పెయిన్ నుంచి వచ్చినట్టు తెలుస్తోంది. స్పెయిన్ లో కూడా వైరస్ ఉదృతంగా ఉంది. మరోవైపు కేంద్ర ప్రభుత్వం వైరస్ ను అదుపు చేయటానికి పలు చర్యలను చేపడుతోంది. కరోనాను జాతీయ విపత్తుగా ప్రకటించిన సంగతి విదితమే.. దేశంలో పలు విద్యాసంస్ధలకు, వ్యాపార సంస్థలు, థియేటర్లు, మాల్స్ ను ఈ నెల 31వరకు మూసివేయాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.