కరోనా కరోనా కరోనా కనికరించమ్మా కరోనా ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడ చూసినా ఇదే నినాదం నడుస్తోంది. ఎక్కడో చైనాలోని వుహాన్ నగరంలో పుట్టిన కరోనా వైరస్ ఇప్పుడు ప్రపంచాన్ని దిగ్బంధంలోకి నెట్టేసింది. క్రమ క్రమంగా ఒక్కో దేశం కరోనా నిర్భంధంలోకి వెళ్లి పోతున్నాయి. ఇరవై రోజుల క్రితం వరకు మన దేశానికి ఎలాంటి ఇబ్బంది ఉండదని మనం అంతా ఊపిరి పీల్చుకున్నాము. అయితే ఈ మహమ్మారి ఇప్పుడు ప్రపంచ మహమ్మారిగా మారిపోయింది.
ఈ వైరస్ ఇప్పుడు ప్రపంచంలో ఏకంగా 200 దేశాలకు పాకేసింది. వేలాదిమంది ప్రాణాలు బలిగొని, లక్షలాదిమందిని ప్రమాదంలోకి నెట్టేసింది. అయితే, ఈ విషయంలో మిగతా ప్రపంచాన్ని అప్రమత్తం చేయని చైనాపై అనేక దేశాల నుంచి తీవ్రమైన విమర్శలు వ్యక్త మవుతున్నాయి. పలువురు దేశాల అధ్యక్షులు సైతం చైనా తీరును తప్పు పడుతున్నారు. అసలు ఈ వైరస్ సోకి చైనాలో చాలా మంది చనిపోయారని కూడా సందేహాలు వ్యక్త మవుతున్నాయి.
డ్రాగన్ దేశం చాలా మంది చనిపోయినా ఆ లెక్కలు దాస్తుదన్న విమర్శలు కూడా ఉన్నాయి. ఇక చైనా తీరుపై రోజు రోజుకు విమర్శలు పెరుగుతున్నాయి. చైనాపై అంతర్జాతీయ న్యాయస్థానంలో కేసులు వేయొచ్చని ఇజ్రాయెల్ న్యాయ నిపుణుడు నిసాన్ దర్శన్ లీటర్న్ తెలిపారు. ఈ క్రమంలోనే నిసాన్ మాట్లాడుతూ ఉగ్రవాదానికి మద్దతిస్తోందన్న కోణంలో చైనాపై వాదించొచ్చని అన్నారు
.
చైనా కరోనా విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో పాటు వైరస్ సమాచారం దాయడం వల్లే ఈ రోజు ప్రపంచానికి ఈ గతి పట్టిందని వాపోయారు. మరి ఈ అంశంపై చైనా అంతర్జాతీయ కోర్టు బోనులో నిలబడుతుందా ? లేదా ? అన్నది చూడాలి. కరోనా గురించి బయటకు వచ్చిన మూడు వారాల్లోనే చర్యలు కనుక తీసుకుని ఉంటే 95 శాతం నియంత్రించే వీలుండేదని ఇంగ్లండ్లోని సౌతాంప్టన్ యూనివర్సిటీ తెలిపింది.