తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ఇటీవల కీలక వ్యాఖ్య చేసిన సంగతి తెలిసిందే. కరోనా సంక్షోభం మరికొంతకాలం కొనసాగడం ఖాయం. ఆ తర్వాత ఖజానా సంక్షోభమూ అనివార్యం! మరిప్పుడు ఏం చేయాలి? ఎవరు ఎవరిని ఆదుకోవాలి? అనే సందేహాలు వ్యక్తమైన సమయంలో తెలంగాణ ముఖ్యమంత్రి తరుణోపాయం సూచించారు. హెలికాప్టర్ మనీ ఒక్కటే ఇప్పుడు దేశాన్ని గట్టెక్కించే మార్గమని ప్రధాని నరేంద్ర మోదీ అన్ని రాష్ర్టాల ముఖ్యమంత్రులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్సులో కేసీఆర్ ప్రతిపాదన చేశారు. అయితే, ఇది దేశంలో అమలు జరిగలేదు కానీ...మరో దేశంలో మాత్రం అమలైంది.
కోవిడ్19 మహమ్మారి వల్ల న్యూజీలాండ్ ఆర్థిక వ్యవస్థ దెబ్బతింది. ఆర్థిక వ్యవస్థ దాదాపు 21.8 శాతం కుంచించుకుపోనుంది. నీరుగారిన ఆర్థిక వ్యవస్థను ఉద్దీపన చేయడమే లక్ష్యంగా ప్రజలకు నేరుగా ఉచితంగా డబ్బును పంపిణీ చేయాలని న్యూజిలాండ్ ప్రభుత్వం భావిస్తున్నట్లు ఆర్థిక మంత్రి గ్రాంట్ రాబర్ట్సన్ తెలిపారు. హెలికాప్టర్ మనీ గురించి ప్రభుత్వం చేస్తున్న ప్రణాళికలను వెల్లడించాలని ఆర్థిక మంత్రి రాబర్ట్సన్ను ఇటీవల మీడియా సమావేశంలో అడిగారు. కివీస్ సెంట్రల్ బ్యాంకు డబ్బును ముద్రించి, పంపిణీ చేస్తుందా అని రిపోర్టర్లు అడిగారు. లేదంటే ప్రభుత్వమే సెంట్రల్ బ్యాంక్ నుంచి డబ్బును రుణంగా తీసుకుని, తమ చేతుల మీదుగా ప్రజలకు అందజేస్తుందా అని ప్రశ్నించారు. అయితే హెలికాప్టర్ మనీ కాన్సెప్ట్పై ఇప్పుడిప్పుడే ఆలోచిస్తున్నాని, ఆ స్థాయిలో దాని గురించి చర్చలు జరగలేదన్నారు. ప్రస్తుతానికి ఆర్థిక పరపతి విధానమే అమలులో ఉంటుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
కరోనా మహమ్మారి వల్ల న్యూజిలాండ్ ఎదుర్కుంటున్న సమస్యలకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ న్యూజిలాండ్ భారీ సంస్కరణలకు ఊతం ఇవ్వనుంది. కివీస్ రిజర్వ్ బ్యాంక్ తన క్యాష్ రేటును అత్యల్పంగా 0.25 శాతానికి తగ్గించింది. బాండ్లు కొనుగోలు రేట్లను రెండింతలు పెంచింది. కరోనా వైరస్తో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న న్యూజిలాండ్.. ఇక హెలికాప్టర్ మనీపైనే ఆశలు పెట్టుకుంది.