కరోనా వైరస్.. ఈ పేరు వినడం ప్రజలకు అలవాటు అయిపోయినా.. దీని భయం మాత్రం అస్సలు తగ్గడం లేదు. ఈ మహమ్మారి ఎటు నుంచి ఎలా ఎటాక్ చేస్తుందో తెలియక ప్రజలు తెగ సతమతమవుతున్నారు. మొదట చైనాలో మొదలైన కరోనా వైరస్.. ప్రస్తుతం ప్రపంచంలోని అన్ని దేశాలకు విస్తరించి అటు ప్రజలను, ఇటు ప్రభుత్వాలను ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. ఇక తాజా లెక్కల ప్రకారం అంతర్జాతీయంగా ఇప్పటి వరకు ఒక కోటీ లక్షా 29 వేల మందికి సోకింది. మొత్తం 5 లక్షల 2 వేల మంది కరోనాతో ప్రాణాలు విడిచారు.
ఇక ఇది కొత్తరకం ప్రాణాంతక వైరస్ కావడంతో దీనికి వ్యాక్సిన్ కోసం పరిశోధనలు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో అందరి ఆశలూ వ్యాక్సిన్ తయారీపైనే ఉన్నాయి. అన్ని దేశాలూ వ్యాక్సిన్ కోసమే ఎదురుచూస్తున్నాయి. అయితే ఇదే సమయంలో కరోనా గురించి కొన్ని భయంకర విషయాలు బయటపడుతుండడంతో.. ప్రజలను మరింత ఆందోళనకు గురిచేస్తోంది. ఇక తాజాగా మహిళల్లో ముఖ్యంగా గర్భిణీలకు కరోనా ముప్పు ఎక్కువని తాజా పరిశోధనలో తేలింది. ప్రెగ్నెన్సీ ఉన్నవారికి... మామూలు మహిళల కంటే 50 శాతం ఎక్కువగా కరోనా వైరస్ సోకే ప్రమాదం ఉందని అంటున్నారు.
ప్రెగ్నెన్సీ ఉన్న మహిళలకు కరోనా వస్తే... అది చాలా తీవ్రంగా ఉంటోందనీ, తప్పనిసరిగా ఐసీయూలో ట్రీట్మెంట్ ఇవ్వాల్సి వస్తోందని తేల్చి చెప్పారు. ఈ మేరకు అమెరికాకి చెందిన సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ తెలిపింది. సాధారణంగా ప్రెగ్నెన్సీ మహిళలకు ఎక్కువ ఎనర్జీ కావాలి. మరియు బలమైన ఆహారం తీసుకోవాలి. కానీ, చాలా మంది ప్రెగ్నెన్సీ మహిళలకు సరైన పోషకాహారం లభించట్లేదు. దీంతో శరీరంలో ఉన్న పోషకాలు బిడ్డకు చేరిపోతున్నాయి. అందువల్ల వారిలో కరోనాతో పోరాడే రోగ నిరోధించే శక్తి లేకుండా పోతోందని పరిశోధనల్లో వెల్లడైంది. అందుకే వారికి కరోనా వచ్చే రిస్క్ ఎక్కువని అంటున్నారు. కాబట్టి, ప్రెగ్నెన్సీ మహిళలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.