మెహిదీపట్నం డివిజన్లో అత్యల్పంగా 11,818 ఓట్లు పోలయ్యాయి. అంటే ఒక రౌండ్ లోనే మెహిదీ పట్నం రిజల్ట్ తేలిపోతుందన్నమాట. సుమారుగా 11 గంటల సమయంలో మెహిదీ పట్నం లెక్కింపు పూర్తయితే 12 గంటలకు ఫలితాన్ని అనౌన్స్ చేసే అవకాశం ఉంది. ఇక 14వేల నుంచి 28 వేల మధ్య ఓట్లు పోలైన 136 డివిజన్ల ఫలితాలు రెండో రౌండులో తేలిపోతాయి. ఓల్డ్బోయిన్పల్లి, సుభాష్ నగర్, గాజుల రామారం, తార్నాక, ఉప్పల్, కంచన్ బాగ్, కొండాపూర్, అల్లాపూర్, సీతాఫల్ మండి, బన్సీలాల్ పేట, మైలార్ దేవ్ పల్లి, అంబర్ పేట్, రహ్మత్ నగర్ డివిజన్లు మాత్రమే మూడో రౌండు వరకు వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి.
పోటీ నువ్వా నేనా అన్నట్లు ఉండి, ఆ డివిజన్లో చెల్లని ఓట్లు ఎక్కువ ఉంటే ఫలితం వెల్లడిలో మరింత జాప్యం జరిగే అవకాశం ఉంది. చెల్లని ఓట్లపై ఆర్వో తీసుకున్న నిర్ణయంపై అభ్యంతరాలు, వాదోపవాదాలు తలెత్తితే తుది ఫలితం ఆలస్యం కావొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. సాయంత్రం మూడు గంటల్లోగా ఓట్ల లెక్కింపు మొత్తం పూర్తయ్యే అవకాశం ఉందని అధికార వర్గాలు తెలిపాయి. ప్రతి డివిజన్కు ఒక కౌంటింగ్ హాలులో 14 టేబుళ్లు ఏర్పాటు చేశారు. తొలుత పోస్టల్ ఓట్లను లెక్కించి ఫలితాన్ని ప్రకటిస్తారు. ఇతర సిబ్బంది బ్యాలెట్ పెట్టెలను టేబుళ్ల వద్దకు తీసుకొస్తారు. 25 ఓట్ల చొప్పున కట్టలు కడతారు. అలాంటి 40 కట్టలను, అంటే వెయ్యి ఓట్లను ఒక్కో టేబుల్కు ఇస్తారు. అలా ఒక రౌండులో 14 వేల ఓట్ల లెక్కింపు పూర్తవుతుంది. 14వేల ఓట్లకంటే తక్కువగా (11,818) పోల్ అయిన మొహిదీపట్నం డివిజన్ కి సంబంధించి తొలి ఫలితం వెలువడుతుంది.