కరోనా బాధితులు స్టెరాయిడ్స్ వాడిన తర్వాత వారిలో షుగర్ లెవల్స్ ఎక్కువ అవుతాయి. కొన్ని సందర్భాల్లో అప్పటి వరకూ షుగర్ ఉందని అని నిర్థారించుకోని వారికి కూడా కరోనా చికిత్స తర్వాత షుగర్ వ్యాధి బయటపడుతోంది. సహజంగా స్టెరాయిడ్స్ తో షుగర్ లెవల్స్ పెరిగిన తర్వాత సాధారణ డోసు మందులతో అది నియంత్రణలోకి రాదని వైద్యులు పేర్కొంటున్నారు. అలాంటి వాళ్లు షుగర్ నియంత్రణలోకి వచ్చేవరకూ ఇన్సులిన్ వాడుకోవచ్చని, నియంత్రణలోకి వచ్చాక ఇన్సులిన్ ఆపేసి తిరిగి మందులు వాడొచ్చని స్పష్టం చేస్తున్నారు. బరువు పెరుగుతారని, ఇతర ఇబ్బందులొస్తాయని చాలామంది ఇన్సులిన్ వాడకాన్ని పక్కనపెడుతున్నారని, అది సరైన పద్ధతి కాదని హెచ్చరిస్తున్నారు.
వీటికి దూరంగా ఉండాలి..
కరోనానుంచి కోలుకున్న షుగర్ వ్యాధిగ్రస్తులు అన్నం, ఇడ్లీలు, దోసెలు, బంగాళాదుంపతో చేసిన పదార్థాలు, బేకరీ ఐటమ్స్ కి దూరంగా ఉండాలని వైద్యులు చెబుతున్నారు. జొన్నలు, రాగులు, కొర్రలు వంటి వాటితో చేసిన ఆహార పదార్థాలను తీసుకోవాలని, పీచు పదార్థాలు ఎక్కువగా తీసుకోవాలని చెబుతున్నారు. సిట్రస్ జాతి పళ్లు తింటే షుగర్ లెవల్స్ అదుపులో ఉండే అవకాశముందని అంటున్నారు. పైగా సి విటమిన్ తో వ్యాధినిరోధక శక్తి పెరుగుతుందని, ఫంగస్ వచ్చే అవకాశం తక్కువగా ఉందని చెబుతున్నారు. బ్లాక్ ఫంగస్ అనేది లక్షలో ఒకరికి మాత్రమే వస్తుందని, దాని గురించి భయపడవద్దని చెబుతున్నారు నిపుణులు.