హుజూరాబాద్ ఎన్నికల ఫలితాల తర్వాత కెసిఆర్ లో అసహనం పెరిగిపోయింది అని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. ఖమ్మం వెళ్తున్న ఆయన మార్గ మధ్య లో చౌటుప్పల్ లో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో మాట్లాడారు. కేసీఆర్ అసహనం మొత్తం రైతుల పై చూపి ధాన్యం కొనుగోలు చేయకుండా రైతులను ఇబ్బంది పెడుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం ఏడు సంవత్సరాల నుండి తెలంగాణ ధాన్యం పూర్తిగా కొన్నది అని గుర్తు చేశారు.
రైతాంగం పండిచిన ధాన్యం మీద రాష్ట్రం ఒక్క రూపాయి కూడా పెట్టుబడి పెట్టదని, మొత్తం పెట్టుబడి కేంద్రమే పెడుతుంది అన్నారు. ఎంత పంట పండించినా సరే కానీ, `రా` రైస్ మాత్రమే తీసుకుంటుందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది, దుంపుడు బియ్యం వద్దని చెప్పింది దీనికి రాష్ట ప్రభుత్వం సూత్రప్రాయంగా అంగీకారం తెలిపిందని చెప్పారు. కానీ, కేంద్ర ప్రభుత్వాన్ని బద్నాం చేసేందుకే ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం రైతుల ధాన్యం కొనక పోవడం తో రైతులు కల్లాల వద్ద పడిగాపులు కాస్తున్నారు అని మండిపడ్డారు.
రాజకీయాలు పక్కన పెట్టీ.. కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు పక్కన పెట్టీ.. మన రైతుల ధాన్యం కొనుగోలు చేయాలని ఈటల రాజేందర్ డిమాండ్ చేశారు. ధనిక రాష్ట్రం అని చెప్పే ముఖ్యమంత్రి రైతుల ధాన్యం ఎందుకు కొనలేక పోతున్నవని సూటిగా అడుగుతున్నాను అని ప్రశ్నించారు. కేంద్రం అవసరానికి మించిన ధాన్యం కొనుగోలు చేయం అని ముందే చెప్పినా ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోక మొద్దు నిద్రలో ముఖ్యమంత్రి ఉన్నారని ఎద్దేవా చేశారు. ఈ రాష్ట్రం లో పోలీసులను వాడుకొని ముఖ్యమంత్రి కేసీఆర్ దౌర్జన్య రాజకీయాలు చేస్తున్నాడని ఈటల రాజేందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రానున్న రోజులలో బీజేపీ పార్టీ అధికారం లోకి రాబోతుంది అని ధీమా వ్యక్తం చేశారు.